దేశ విభజనకు కాంగ్రెస్ కారణం! నేతల అవివేకం వల్లే పాకిస్థాన్ ఏర్పడిందన్న మోడీ
Recommended Video
పోలింగ్కు సమయం దగ్గరపడే కొద్దీ నేతల ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రత్యర్థులపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర లాతూర్లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ.. కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. దేశ విభజన, పాకిస్థాన్ ఏర్పాటుకు కాంగ్రెస్ నేతలే కారణమని ఆరోపించారు. ఆ పార్టీ మేనిఫెస్టో కాశ్మీర్ విషయంలో పాక్ వైఖరిని సమర్థిస్తోందని విమర్శించారు.
ఉద్యోగం, ఉపాధి ఊసేలేదు బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాల ఫైర్
పాక్ ఏర్పాటుకు కాంగ్రెస్ కారణం
దేశ విభజనకు కాంగ్రెస్ కారణమని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు తెలివిగా వ్యవహరించి ఉంటే పాకిస్థాన్ ఏర్పడి ఉండేది కాదని అన్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోపై మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశ్మీర్ విషయంలో పాకిస్థాన్ వైఖరిని సమర్థించేలా ఆ పార్టీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పాకిస్థాన్ కోరుకుంటున్నట్లే జమ్మూకాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని తొలగించవద్దన్న అంశాన్ని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ప్రస్తావించిందని విమర్శించారు.
భద్రతా వ్యవస్థ నిర్వీర్యానికి ప్రయత్నం
కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు భద్రతా వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని మోడీ ఆరోపించారు. యూపీఏ భాగస్వామ్యపక్షాలు దేశ వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తున్నాయని, పాకిస్థాన్ వాడుతున్న పదజాలాన్నే కాంగ్రెస్ వినిపిస్తోందని విమర్శించారు. ఉగ్రవాదులు హింసోన్మాదంతో చెలరేగుతుంటే తాము చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు.
ఫస్ట్ టైం ఓటర్లకు వినతి
తొలిసారి ఓటు వేయనున్న యువత తప్పకుండా తమ హక్కును వినియోగించుకోవాలని ప్రధాని కోరారు. బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన వారికి తమ ఓటును అంకింతం ఇవ్వాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రాభివృద్ధి కోసం బీజేపీకి పట్టం కట్టాలన్న మోడీ ఆకాంక్షించారు. పేదలకు గూడు, రైతులకు సాగునీరు అందించాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్న బీజేపీకి భారీ మెజార్టీ కట్టబెట్టాలని మోడీ పిలుపునిచ్చారు.