మోడీ ధైర్యంగా పులి మీద స్వారీ చేస్తున్నారు: నితీష్ ఆసక్తికర వ్యాఖ్య
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రకటన నేపథ్యంలో పులి మీద స్వారీ చేస్తున్నారని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ అన్నారు.
పాట్నా: నల్ల ధనాన్ని నిర్మూలించేందుకు రూ.500, రూ.1000 నోట్లను ప్రధాని నరేంద్ర మోడీ రద్దు చేయడాన్ని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీష్ కుమార్ సమర్థించారు. అంతేకాదు, ప్రధానమంత్రి ఇప్పుడు ధైర్యంగా పులి పైన స్వారీ చేస్తున్నారని కితాబిచ్చారు.
నోట్ల రద్దు అంశంపై పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ఇప్పుడు పులి మీద స్వారీ చేస్తున్నారని, ఈ నిర్ణయం ఆయన మిత్రపక్షాలలోనే విభేదాలు తెచ్చేలా ఉందని, కానీ ఈ నిర్ణయానికి అనుకూలంగా ప్రజలలో బలమైన సెంటిమెంట్ ఉందని, దానిని గౌరవించాలన్నారు.
ప్రధాని మోడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నితీశ్ కుమార్ మొదటి నుంచి సమర్థిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రజలు కష్టాలు పడుతున్నారని జేడీయూకి చెందిన పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.
అయితే ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను కేంద్రానికి తెలియజేసేందుకు పార్టీ ఎప్పుడూ వెనుకాడదని నితీష్ కుమార్ స్పష్టం చేశారు. నల్లధనాన్ని నిర్మూలించేందుకు బినామీలపై చర్యలు తీసుకునే విషయంలో తమ మద్దతు మోడీకి ఎప్పుడూ ఉంటుందన్నారు.
కాగా, మోడీకి నితీష్ కుమార్ మొదటి నుంచి బద్ధ శత్రువుగా ఉంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో జేడీయూ (నితీష్ కుమార్ పార్టీ) ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు పాతికేళ్ల రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి లాలూ ప్రసాద్ యాదవ్తో చేతులు కలిపారు.