మోడీ మరో అనూహ్య చర్య: రాష్ట్రపతితో భేటీ: దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ వెంకయ్య కామెంట్స్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో అనూహ్య అడుగు వేశారు. ఏ మాత్రం ఊహించని రీతిలో చర్యలను తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఎలాంటి షెడ్యూల్ లేకుండా లఢక్లో పర్యటించి వచ్చిన నరేంద్ర మోడీ.. తాజాగా మరోసారి అలాంటి అనూహ్య చర్యను తీసుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో సమావేశం అయ్యారు. ఆదివారం ఉదయం దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్లో రామ్నాథ్ కోవింద్తో భేటీ అయ్యారు. లఢక్ నుంచి తిరగొచ్చిన రెండోరోజే ఆయన రాష్ట్రపతి భవన్కు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందరి దృష్టీని అటువైపు మరల్చుకుంది.
లఢక్ పర్యటన గురించి రాష్ట్రపతికి వివరణ..
ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. జాతీయంగా, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాల గురించి రాష్ట్రపతికి వివరించారు. ప్రత్యేకించి- లఢక్ సమీపంలో చోటు చేసుకున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారని అంటున్నారు. చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి తీసుకుంటోన్న చర్యలను రాష్ట్రపతికి తెలియజేశారు. శుక్రవారమే లఢక్, లేహ్లో పర్యటించారు నరేంద్ర మోడీ. సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. వారిని ఉత్తేజితులను చేశారు. దేశం మొత్తం సైన్యం వెంట ఉందనే ఆత్మస్థైర్యాన్ని, నైతిక బలాన్ని జవాన్లకు ఇచ్చారు నరేంద్ర మోడీ.
సైన్యంలో ఆత్మస్థైర్యం..
చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలు తలెత్తడం, రెండు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న ప్రాణాంతక ఘర్షణలు చోటు చేసుకోవడం, డ్రాగన్ కంట్రీతో వ్యాపార, వాణిజ్య సంబంధాలను తెంపుకోవడం వంటి పరిణామాలతో లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వెంబడి తీవ్ర ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ లఢక్లో పర్యటనకు వెళ్లారు. సముద్ర మట్టం నుంచి సుమారు 11 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లేహ్ను సందర్శించారు.
చైనా సైతం ఉలికిపాటు..
లేహ్ ప్రధాన కేంద్రంగా పని చేస్తూ, లఢక్ సరిహద్దుల వద్ద పహారా కాస్తోన్న 14 కార్ప్స్ ఆర్మీ అధికారులు, సరిహద్దు భద్రతా బలగాలు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి కీలకమైన విభాగాలతో మోడీ సమావేశం అయ్యారు. సుమారు అయిదు గంటల పాటు ఈ సమీక్షా సమావేశం కొనసాగింది. సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులను సమీక్షించడానికి ఏకంగా ప్రధానమంత్రే బరిలో దిగడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం దేశం ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. చైనా సైతం మోడీ పర్యటన పట్ల ఉలిక్కిపడింది. అదే సమయంలో మోడీ.. రాష్ట్రపతితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Recommended Video
సంక్లిష్ట పరిస్థితుల్లో దేశం..
దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. దేశం ఇదివరకెప్పుడూ చవిచూడని విధంగా, చరిత్రలో లేనివిధంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. దేశం వెలుపల నుంచే కాకుండా.. అంతర్గతంగా కూడా గతంలో ఎప్పుడూ లేనన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనగల శక్తి సామర్థ్యాలు భారత్కు ఉన్నాయని అన్నారు. ఎలాంటి సవాళ్లు ఎదురైనా అధిగమించేగలమనే ధీమాను వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ట్వీట్ చేశారు.