మోడీ మహా సంకల్పం: ఆదివారం రాత్రి 9 గంటలకు.. తొమ్మిది నిమిషాల పాటు: ప్రధాని సంచలన పిలుపు
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సరికొత్త పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉన్నారనే విషయాన్ని చాటి చెప్పడానికి ఈ నెల 5వ తేదీన ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటలకు దేశవ్యాప్తంగా విద్యుత్ దీపాలను ఆర్పి వేయాలని సూచించారు. అదే సమయంలో ప్రతి ఒక్కరు కొవ్వుత్తులు, దీపాలను వెలిగించాలని విజ్ఙప్తి చేశారు. తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ దీపాలను ఆర్పివేసి, దీపాలను వెలిగించాలని చెప్పారు. శుక్రవారం ఉదయం సరిగ్గా 9 గంటలకు ఆయన ఓ వీడియో సందేశాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
Recommended Video
ప్రతి గుమ్మం దీపాలతో వెలిగిపోవాలి..
దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్లు, టార్చిలైట్లతో ప్రతి గుమ్మం వెలిగిపోవాలని అన్నారు. 130 కోట్ల మంది ప్రజలు ఒకేసారి ఈ పని చేయాలని కోరారు. కరోనా సంకోభ సమయంలో ప్రతి ఒక్కరికి, తోటి వ్యక్తే నైతిక మద్దతు పలుకుతున్నామనే విషయాన్ని తెలియజేయాలని అన్నారు. లైట్లను ఆర్పివేయడం ద్వారా పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తాము అండగా ఉన్నామనే సందేశాన్ని ఇవ్వాలని నరేంద్ర మోడీ కోరారు. ప్రతి గుమ్మం కూడా దీపాల కాంతులతో వెలిగిపోవాలని ఆయన అకాంక్షించారు.
మనం ఒంటరి కాదు..
కరోనా వైరస్ విస్తరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఒక్కరు కూడా ఒంటరి కాదని, తోటి వ్యక్తే తమకు అండగా ఉన్నాడనే సందేశాన్ని ఈ దీపాల ద్వారా ప్రసరింపజేయాలని మోడీ చెప్పారు. 130 కోట్ల మంది ప్రజలు ఒక్కసారిగా లైట్లను ఆర్పివేసి, దీపాలు, కొవ్వొత్తులతో ఇంటి బయటికి రావాలని కోరారు. తమ సామూహిక శక్తిని ప్రదర్శించాలని చెప్పారు. దేశ ప్రజలు సాక్షాత్తూ భగవత్ స్వరూపులని ప్రధాని కొనియాడారు. తమ శక్తిని చాటుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు.
తొమ్మిదో రోజుకు చేరిన పోరాటం..
కరోనా మహమ్మారిపై దేశ ప్రజలు ఆరంభించిన యుద్ధం..తొమ్మిదో రోజుకు చేరుకుందని అన్నారు. ఓ భారీ యుద్ధాన్ని దేశం కొనసాగిస్తోందని అన్నారు. సంక్షోభ పరిస్థితులు ఏర్పడిన ప్రతీసారీ దేశ ప్రజలు తమ విశ్వరూపాన్ని ప్రదర్శించాలని అన్నారు. దేశ ప్రజలందరూ ఏకమై కరోనా వైరస్ను తరిమి కొడతారనే ఆత్మ విశ్వాసం తనకు ఉందని అన్నారు. ఈ ఐక్యత దేశాన్ని ముందుండి నడిపిస్తుందని అన్నారు.
సామాజిక దూరాన్ని పాటిస్తూ..
ప్రతి ఒక్కరు కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కోట్లాది కాంతులను వెదజల్లేలా చేయాలని సూచించారు. కరోనా సంక్షోభం నుంచి అనిశ్చితి పుట్టుకొచ్చిందని, దీన్ని ముగింపు పలకడానికి 130 కోట్ల మంది ప్రజలు మహా సంకల్పాన్ని తీసుకోవాలని అన్నారు. దీని ద్వారా తాము ఒంటరి కాదనే విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. కరోనా మహమ్మారి సృష్టించిన ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి ఖచ్చితంగా గట్టెక్కగలుగుతామని ప్రధాని స్పష్టం చేశారు. లాక్డౌన్ పరిస్థితులను వృధా కానివ్వబోమని తేల్చి చెప్పారాయన.