గుజరాత్ లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం, 33 జిల్లాలు, 182 స్థానాలు, ఆ రెండు విషయాల్లో!
Recommended Video
అహ్మదాబాద్: భారత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ శాసన సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గుజరాత్ లో మరోసారి బీజేపీకి అధికారం కట్టబెట్టేలా నరేంద్ర మోడీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గుజరాత్ ఎన్నికలపై ప్రతేక దృష్టి పెట్టారు.
సొంత రాష్ట్రంలో 182 నియోజక వర్గాల్లో జరుగుతున్న శాసన సభ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ అధికారంలోకి రావాలని కమలనాథులు కసరత్తులు చేస్తున్నారు. గుజరాత్ లోని 33 జిల్లాల్లో ప్రధాని నరేంద్ర మోడీతో 36కు పైగా ర్యాలీలు నిర్వహించాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు.
ముహుర్తం పెట్టారు!
ప్రతి జిల్లాలో మూడు నుంచి ఐదు శాసన సభ నియోజక వర్గాల్లో నరేంద్ర మోడీ పర్యటించేలా ఎన్నికల షెడ్యూల్ రూపకల్పనపై బీజేపీ నాయకులు కసరత్తులు చేస్తున్నారు. నవంబర్ 18వ తేదీ శనివారం నరేంద్ర మోడీ గుజరాత్ లో మొదటి పర్యటన ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ముచ్చటగా 22 ఏళ్లు!
గుజరాత్ లో గత 22 ఏళ్ల నుంచి బీజేపీనే అధికారంలో ఉంది. ఈ సారి ఎలాగైనా గుజరాత్ లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ విఫలయత్నం చేస్తోంది. గుజరాత్ లో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ కుల సమీకారణాలతో బలమైన కూటమిగా ఏర్పాటు చేసే దిశగా కసరత్తులు చేస్తోంది.
కాంగ్రెస్ కుల రాజకీయాలు
గుజరాత్ లో పాటీదార్ వర్గ నేత హార్దిక్ పటేల్, ఎస్సీ వర్గానికి చెందిన జిగ్నష్ మేవానీ, బీసీ వర్గానికి చెందిన అల్ఫేష్ ఠాకూర్ లను కాంగ్రెస్ పార్టీ తనవైపుకు తిప్పుకునింది. గుజారత్ లో రాహుల్ గాంధీ కులతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.
టార్గెట్ నోట్ బ్యాన్, జీఎస్టీ
పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా ప్రజలు ఎదుర్కొన్న కష్టాల గురించి కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా ప్రచారం చేస్తోంది. జీఎస్టీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మోడీకి వ్యతిరేకంగానే ఉంది. దీనిని కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకునే అవకాశం ఉంది. జీఎస్టీ స్లాబుల్లోని తాజా మార్పులతో ప్రజల ఆగ్రహాన్ని కొంతైన తగ్గించాలని కమలనాథులు ప్రయత్నాలు చేస్తున్నారు.
గత ఎన్నికల్లో మోడీ ఆరోపణలు!
2012లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం గుజరాత్ అభివృద్దిని అడ్డుకుంటుందని అప్పట్లో నరేంద్ర మోడీ ఆరోపించారు. ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉన్నందున బీజేపీ నాయకులు గుజరాత్ ప్రజలను ఎలా ఆకర్షిస్తారో వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.