2016లో ప్రధాని విదేశీ పర్యటనలు కుదింపు, కారణం
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం వచ్చేసింది. ఈ ఏడాది ప్రధాని నరేంద్రమోడీ తన విదేశీ పర్యటనలను కుదించుకోవాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రపంచంలోని వివిధ ఖండాల్లో ఉన్న33 దేశాల్లో ఆయన పర్యటించారు. 19 నెలల కాలంలో ప్రపంచంలోని నేతల్లో మూడింట రెండొంతుల మందిని ఇప్పటికే కలుసుకున్నారు.
అయితే ఈ ఏడాది కూడా ఆయన విస్తృతంగా విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉన్నప్పటికీ గతేడాది చేసినన్నీ విదేశీ పర్యటనలు ఈ ఏడాది ఉండక పోవచ్చని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. విదేశీ పర్యటనలు కుదించుకోవడం ద్వారా స్థానిక అంశాలపైనా, బడ్జెట్ సమావేశాలపైనా మరింత దృష్టి సారించే అవకాశం ఉంది.
కొత్త సంవత్సరంలో తొలి ఆరు నెలలకు గానూ రెండు విదేశీ పర్యటనలే ఖరారయ్యాయి. ఈ ఏడాది ప్రధాని మోడీ అమెరికా, చైనా, వెనిజులా, లావోస్, జపాన్, పాకిస్థాన్ దేశాల్లో అధికారికంగా పర్యటించనున్నారు. మార్చి చివరలో అమెరికాలో జరుగబోయే న్యూక్లియర్ సెక్యురిటీ సమ్మిట్ (ఎన్ఎస్ఎస్)తో ఆయన విదేశీ పర్యటన మొదలు కానుంది.
ఆ తర్వాత చైనా ఆతిథ్యం ఇవ్వనున్న జీ-20 సమ్మిట్, వెనిజులాలో జరుగబోయే ఆలీన దేశాల శిఖారాగ్ర సదస్సు, లావోస్లో నిర్వహించనున్న ఆసియాన్ (తూర్పు ఆసియా దేశాల సదస్సు), జపాన్లో నిర్వహించబోయే ఇండో-జపాన్ సమ్మిట్, పాకిస్థాన్లో సెప్టెంబర్-నవంబర్ నెలలో జరిగే సార్క్ (సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఆఫ్ రీజియనల్ కో ఆపరేషన్) సదస్సుల్లో మోడీ పాల్గొంటారు.
ఈ ఏడాది ప్రధాని మోడీ తన విదేశీ పర్యటనలు తగ్గించుకోవడానికి ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలు కూడా మరో కారణమని సమాచారం.