స్వామికి మోడీ షాక్: 'రాజన్ దేశభక్తిని శంకించను'
న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్ రఘరాం రాజన్, కేంద్ర ఆర్ధిక శాఖ సీనియర్ అధికారులపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆరోపణలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనుచిత వ్యాఖ్యలంటూ తప్పుబట్టారు. వారిపై ఆరోపణలు చేయడం సరికాదని తేల్చిచెప్పారు. వ్యవస్థ కంటే తామే గొప్పవారమని అనుకుంటే అది సరికాదని స్వామిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రఘురాం రాజన్ దేశభక్తిని తాను శంకించబోనని చెప్పారు. అందరికన్నా ఆయనకు ఎక్కువ దేశభక్తి ఉందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. రాజన్ను తాను అతి దగ్గరగా చూశానని, ఆయన ఏ పదవిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా దేశానికి సేవ చేస్తారని ప్రధాని మోడీ చెప్పారు.
రాజన్ మానసికంగా భారతీయడు కాదన్న స్వామి ఆరోపణలపై మోడీపై విధంగా స్పందించారు. కేంద్రం తన రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా టైమ్స్ నౌకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీఏ నియమించిన రాజన్ను మోడీ ప్రభుత్వం తొలగిస్తుందని అంతా తప్పుడు ప్రచారం చేశారని అన్నారు.
రాజన్ పూర్తి సమయంలో తన పదవిలో కొనసాగుతారని తెలిపారు. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, కేంద్ర ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత్ దాస్ లక్ష్యంగా స్వామి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీపైనా స్వామి పరోక్షంగా విమర్శలు చేశారు.
ఈ క్రమంలో స్వామి చేసిన వ్యాఖ్యలు పార్టీతో పాటు దేశానికి నష్టం కలిగించే స్థితిలో ఉండటంతో సాక్షాత్తూ ప్రధాని మోడీనే స్పందించడం విశేషం. 'ఇది మా పార్టీలో జరింగిందా లేక వేరే పార్టీలోనా అన్నది పక్కనబెడితే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. పబ్లిసిటీపై మోజుతో ఇలా చేయడం దేశానికి ఏమాత్రం మేలు చేయదు. ప్రజలు ఎంతో బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఉంది. ఎవరైనా తాము వ్యవస్థ కంటే గొప్పవారమని అనుకుంటే అది తప్పు' అని మోడీ వ్యాఖ్యానించారు.