ప్రధాని మోడీ నోట నిన్న గురజాడ..నేడు ఎంజీఆర్: సొంత రాష్ట్రానికి ఎనిమిది కొత్త రైళ్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎనిమిది కొత్త రైళ్లను ప్రారంభించారు. దేశంలోని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల నుంచి గుజరాత్లోని కెవాడియాను కనెక్ట్ చేస్తూ పట్టాలెక్కించిన రైళ్లు అవి. దేశ రాజధాని నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా రైలు సర్వీసులను ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని కొద్దిసేపు ప్రసంగించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే వ్యవస్థాపకుడు, దివంగత ఎంజీ రామచంద్రన్ గురించి ప్రస్తావించారు.
ఫోటోలు: దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం
కెవాడియా.. గుజరాత్లో ప్రతిష్ఠించిన ఎత్తయిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రమం స్టాట్యూ ఆఫ్ యూనిటీకి సమీపంలో ఉండే రైల్వేస్టేషన్. దీన్ని కనెక్ట్ చేస్తూ వేర్వేరు ప్రాంతాల నుంచి ఎనిమిది సర్వీసులను రైల్వే మంత్రిత్వ శాఖ పట్టాలెక్కించింది. ఉత్తర ప్రదేశ్లోని తన సొంత లోక్సభ నియోజకవర్గం వారణాశి, ముంబై శివార్లలోని దాదర్, గుజరాత్లోని అహ్మదాబాద్, ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్, మధ్యప్రదేశ్లోని రెవా, చెన్నై, ప్రతాప్నగర్ నుంచి కెవాడియా మధ్య రాకపోకలు సాగించే రైళ్లు అవి. వాటిని జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో అహ్మదాబాద్-కెవాడియా మధ్య ప్రవేశపెట్టిన జన్ శతాబ్ది రైలు విస్టాడోమ్ మోడల్.
కెవాడియా-చందోడ్ గేజ్ మార్పిడి పనులు, ప్రతాప్నగర్-కెవాడి మధ్య రైల్వే పట్టాల విద్యదీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మోడీ కొద్దిసేపు ప్రసంగించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీని సందర్శించడానికి వచ్చే పర్యాటకుల కోసం కొత్త రైలు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చిన తరువాత.. అదనంగా రోజూ లక్షమందికి పైగా సందర్శకులు గుజరాత్కు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. వారికి రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపర్చబోతోన్నామని అన్నారు. మొదట్లో తాను న్యారో గేజ్ రైళ్లల్లో ప్రయాణించినట్లు పాత విషయాలను గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన ఎంజీ రామచంద్రన్ గురించి ప్రస్తావించారు. పురచ్చి తలైవర్ ఎంజీ రామచంద్రన్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి కెవాడియాకు రైలు సర్వీస్ను ప్రారంభించడం తనకు ప్రత్యేకంగా ఆనందాన్ని ఇస్తోందని చెప్పారు. ఎంజీఆర్ పేదల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేశారని గుర్తు చేశారు. ఎంజీఆర్ జయంతి నాడే ఆయన సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి తన గుజరాత్కు రైల్ కనెక్టివిటీని కల్పించడం తన సంతోషాన్ని రెట్టింపు చేస్తోందని చెప్పారు. ఎంజీఆర్కు ఇచ్చే గౌరవంగా తాను భావిస్తున్నానని అన్నారు.