నాకు అంత సమయంలేదు: మెట్రో రైల్లో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, విధానపరమైన నిర్ణయాలు ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. ఆయన బదార్పూర్ - ఫరీదాబాద్ మెట్రో లింక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆయన మెట్రో రైలులో ప్రయాణించారు.
దేశ అభివృద్ధి తన లక్ష్యమని చెప్పారు. హర్యానా తనకు రెండో ఇల్లు లాంటిది అన్నారు. తమ ప్రభుత్వం ఏకైక లక్ష్యం దేశ అభివృద్ధి అని చెప్పారు. గుజరాత్ నుంచి వచ్చాక తాను చాలాకాలం హర్యానాలో గడిపానని ప్రధాని మోడీ చెప్పారు.
అభివృద్ధి ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమన్నారు. తమ ప్రభుత్వం, తన లక్ష్యం కేవలం అభివృద్ధి మాత్రమే అన్నారు. ప్రతి పేదవాడికి సొంతింటి కలను తాము తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. అభివృద్ధితోనే పేదలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. విపక్షాల విమర్శల పైన స్పందించేంత తీరిక తనకు లేదన్నారు.
ఇక ఒకే ర్యాంకు ఒకే పింఛను
మాజీ సైనికులు గత నలభై ఏళ్లుగా డిమాండ్ చేస్తూ వచ్చిన ఒకే ర్యాంకు- ఒకే పింఛన్ (ఓఆర్ఓపీ)కు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సరేనంది. అయితే దీనిలోని కీలక నిబంధనల పట్ల మాజీ సైనికులు పెదవి విరిచారు. దీనిపై ఆదివారం తుది నిర్ణయం తీసుకుంటారు.
ఓఆర్ఓపీ అమలుకు కేంద్రం నిర్ణయించిందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ శనివారం సమావేశంలో ప్రకటించారు. యూపీఏ ప్రభుత్వం ఓఆర్ఓపీపై హామీ ఇచ్చినా, వివరాల్లోకి వెళ్లలేదనీ, అందుకే కేవలం రూ.500 కోట్లు కేటాయించి సరిపెట్టిందన్నారు.
ప్రతి ఏటా పదవీ విరమణ చేస్తున్న 40 వేలమందికీ ప్రభుత్వ నిర్ణయం వల్ల లబ్ధి కలుగుతుందన్నారు. త్రివిధ దళాధిపతులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడిన పారికర్... రాతపూర్వక ప్రకటనను చదివి వినిపించి, వెళ్లిపోయారు. విలేకరులు ప్రశ్నలు అడిగే వీలులేకుండా పోయింది. ముందస్తు పదవీ విరమణ తీసుకునేవారికి ప్రయోజనం కల్పించకూడదనే నిర్ణయాన్ని మాజీ సైన్యాధిపతి విపి మాలిక్ తప్పుపట్టారు.