భాషపై పట్టు, విలువలు ఆచరణీయం, వెంకయ్యనాయుడు వీడ్కోలు సభలో మోడీ
ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు అద్భుతంగా పనిచేశారని ప్రధాని మోడీ కీర్తించారు. తన ఐదేళ్ల పదవీ కాలంలో సభకు సభ్యుల హాజరుశాతం పెంచేందుకు కృషి చేశారని తెలిపారు. 70 శాతం సభ్యులు సభకు హాజరయ్యారని వివరించారు. వెంకయ్య నాయుడు విలువలు, మార్గదర్శనం మేరకు మిగతావారు నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Recommended Video
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ముగిసిపోయే సమయం వచ్చింది. ఆయనకు ధన్యవాదాలు తెలియజెప్పేందుకు ఇక్కడ సమావేశమై ఉన్నామని, ఇది ఎంతో భావోద్వేగంతో కూడిన సందర్భం అని మోడీ అన్నారు. సభకు ఎన్నో చారిత్రక క్షణాలు.. మీ మనోహరమైన ఉనికితో ముడిపడి ఉంటాయని తెలిపారు. వెంకయ్యనాయుడి గురించి చెప్పుకోవాల్సిన ఒక విశిష్టత ఉంది. అది చమత్కారం. భాషలపై ఆయనకు ఉన్న పట్టు.. ఎప్పుడూ ఎంతో ఉన్నతమైనది. ఆయన గురించి ప్రశంసించాల్సిన వాటిల్లో ఒక ముఖ్యమైనది.. భారత భాషల పట్ల ఆయనకున్న ప్యాషన్. ఆయన సభకు అధ్యక్షత వహించిన తీరులో ఇది కనిపించింది.
నాయుడుతో ఎన్నో ఏళ్లుగా కలసి పనిచేశాను. ఎన్నో బాధ్యతలు చేపట్టడమే కాకుండా, ప్రతీ ఒక్కదానినీ గొప్ప అంకిత భావంతో నిర్వహించడాన్ని స్వయంగా చూశానని ప్రధాని మోడీ ప్రస్తావించారు. జాతికి వెంకయ్యనాయుడి సేవలు, మార్గదర్శకం ఇక ముందు కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్, ప్రధాని అందరూ స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత జన్మించిన వారు కాగా, వారి మార్గదర్శకంలో ఈ ఏడాది 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకోవడం విశేషంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు.
వెంకయ్యనాయుడి సేవలను ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. భిన్నమైన సిద్ధాంతాలు కలిగిన వారం కావచ్చు.మీ విషయంలో కొన్ని ఫిర్యాదులు కూడా ఉండొచ్చు. వాటి గురించి మాట్లాడే సమయం కాదు ఇది. కష్టమైన, ఒత్తిళ్ల మధ్య మీరు మీ పాత్రను సమర్థంగా నిర్వహించారు. అందుకు మీకు ధన్యవాదాలు అని ఖర్గే పేర్కొన్నారు.