ఆరోగ్యవనంలో ప్రధాని నరేంద్ర మోడీ: పక్షులతో ఇలా, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ రెండ్రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కరోనా విజృంభణ తర్వాత తొలిసారి సొంత రాష్ట్రానికి వెళ్లిన ప్రధాని మోడీ.. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఐక్యతా విగ్రహానికి సమీపంలో ఆరోగ్యవనం, చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్క్, ఏక్తా మాల్ను ఆయన ప్రారంభించారు.
కేవడియా గ్రామానికి మోడీ..
శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోడీకి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, గవర్నర్ ఆచార్య దేవ్రత్ సాదర స్వాగతం పలికారు. అక్కడ్నుంచి గాంధీనగర్ వెళ్లిన ప్రధాని మోడీ.. దివంగత గుజరాత్ మాజీ సీఎం కేశుభాయ్ పటేల్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత ఆయన నర్మదా జిల్లా కేవడియా గ్రామానికి చేరుకున్నారు.
ఆరోగ్య వనం ప్రారంభం..
ఐక్యత విగ్రహం సమీపంలో 17 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య వనాన్ని మోడీ ప్రారంభించారు. గోల్ఫ్ కార్ట్లో ప్రయాణించి ఆరోగ్యవనం అందాలను వీక్షించారు.
పక్షి సంరక్షణ కేంద్రం ప్రారంభించి..
పక్షి సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. పావురాలు, రామచిలుకలను వీక్షిస్తూ.. ఉల్లాసంగా గడిపారు. పంజరంలోని పావురాలను బయటికి వదిలారు. అనేక జాతుల పక్షులను ఆసక్తిగా తిలకించారు. వాటిలో కొన్ని రకాల చిలుకలు మోడీ చేతిపై వాలాయి.
చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్క్.. ఏక్తామాల్..
అనంతరం చిల్ల్రన్ న్యూట్రిషన్ పార్క్ ను ప్రధాని ప్రారంభించారు. అక్కడి న్యూట్రీ రైలులో కాసేపు సరదా ప్రయాణించారు ప్రధాని మోడీ. భారత సంస్కృతి సంప్రదాయాలు, చేనేత కళలకు అద్దం పట్టే ఏక్తా మాల్ను ఆయన ప్రారంభించారు. అక్కడి కళాకృతులను వీక్షించారు.
సీస్టెయిన్ సేవలు
పర్యటనలో భాగంగా కేవడియా-అహ్మదాబాద్ మధ్య సీస్టెయిన్ సేవలను మోడీ ప్రారంభించారు. అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఆయనకు ఘన నివాళులను అర్పించనున్నారు.