అబ్దుల్ కలామ్ స్మారక మండపం ప్రారంభం, అమ్మ జయలలిత లేని లోటు కనిపిస్తోంది: మోడీ !
మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలామ్ స్మారకమండపాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. తమిళనాడులోని రామేశ్వరం జిల్లా పేయ్ కరుంబులో రూ. 15 కోట్ల వ్యయంతో నిర్మించిన అబ్దుల్ కలామ్ .
చెన్నై: మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్ కలామ్ స్మారకమండపాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. తమిళనాడులోని రామేశ్వరం జిల్లా పేయ్ కరుంబులో రూ. 15 కోట్ల వ్యయంతో నిర్మించిన అబ్దుల్ కలామ్ స్మారకాన్ని గురువారం ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు.
ఢిల్లీ నుంచి నరేంద్ర మోడీ మధురైకి ప్రత్యేక విమానంలో వచ్చారు. తరువాత అక్కడి నుంచి హెలికాప్టర్ లో పేయ్ కరుంబు ప్రాంతానికి చేరుకున్నారు. అబ్దుల్ కలాం ద్వితీయ వర్దంతి సందర్బంగా ఆయన స్మారక మండపం ప్రారంభించిన తరువాత నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
యువతకు ఎంతో ప్రేరణ ఇచ్చారు
అబ్దుల్ కలామ్ యువతకు ఎంతగానో ప్రేరణ ఇచ్చారని, ఈ రోజు ఎంతో మంది యువత జాబ్ క్రియేటర్లుగా ఎదగాలనుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అబ్దుల్ కలామ్ భారతదేశానికి ఎంతో సేవ చేశారని ఇదే సమయంలో గుర్తు చేశారు.
Recommended Video
అమ్మ లేని లోటు కనిపిస్తోంది
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇక్కడ లేని లోటు కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ రోజున మన మధ్య అమ్మ ఉండి ఉంటే ఎంతో సంతోషించి ఉండేవారని, ఆమె ఆత్మ రూపంలో తన ఆశీస్సులను మనకు అందిస్తూనే ఉంటారని ప్రధాని మోడీ చెప్పారు. మనం అందరూ గుర్తించుకోవలసిన నేత అమ్మ జయలలిత అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
అగ్ని- 2 క్షిపణి పోలికతో
రూ. 15 కోట్ల వ్యయంతో అబ్దుల్ కలామ్ స్మారక మండపం నిర్మించారు. 4 టన్నుల బరువు, 45 అడుగుల ఎత్తు ఉన్న అగ్ని-2 క్షిపణిలా ఉన్న స్థూపం కింద ఏడు అడుగుల ఎత్తు ఉన్న అబ్దుల్ కలామ్ కంచు విగ్రహాన్ని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ఇదే సందర్బంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కలాంపేరులోని ఏపీజేఏకేని విస్తరించారు. ఎనీథింగ్ ఈజ్ పాజిబుల్ విత్ జస్ట్ ఆటిట్యూడ్ అండ్ కర్మ అని తనదైన శైలిలో నిర్వచనం చెప్పారు.
ఇస్లాం మతంకు వ్యతిరేకం
ఇస్లాం మతంకు వ్యతిరేకంగా విగ్రహం ఏర్పాటు చేసి పూజలు చెయ్యడానికి అవకాశం లేదని కొన్ని ఇస్లాం మత సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అబ్దుల్ కలామ్ విగ్రహం ఎందుకు ఏర్పాటు చెయ్యాలని కొందరు ప్రశ్నించారు. అయితే అబ్దుల్ కలామ్ సోదరుడు మహమ్మద్ అనుమతితో కంచు విగ్రహం ఏర్పాటు చేసి జాతికి అంకితం చేశారు.
ప్రముఖుల హాజరు
ఉప రాష్ట్రపతిగా పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్థి ఎం. వెంకయ్యనాయుడు, తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్, డీఆర్ డీఏ అధికారులు, ఆ రాష్ట్ర మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.