మోడీ మనసులో ఏముందో: కపిల్, గవాస్కర్కు పిలుపు
ముంబై/న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్లను తన ఆస్ట్రేలియా పర్యటన బృందంలో చేర్చుకున్నారు. ఈ విషయాన్నీ కపిల్ దేవ్ స్వయంగా మీడియాతో చెప్పారు. మోడీతో కలసి తాము ఆస్ట్రేలియాలోని సిడ్నీ, కాన్బెర్రా, మెల్బోర్న్ నగరాల్లో పర్యటించనున్నట్టు చెప్పారు.
ఇది తమకు ఒక అద్భుత అవకాశమని, క్రికెటర్లను మోడీ ఎలా ఉపయోగించుకుంటారో, అయన మనసులో ఏముందో తెలియదన్నారు. మోడీతో తాను క్రికెట్ గురించి మాట్లాడేందుకు ఇష్టపడతానని చెప్పారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ మయన్మార్లో పర్యటిస్తున్నారు. ఏషియన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. నవంబర్ 14న ఆయన ఆస్ట్రేలియాలో ఉంటారు.
చందా కొచ్చర్కు ప్రధాని ప్రశంస
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ అండ్ సీఈవో చందా కొచ్చర్కు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. స్వచ్ఛ భారత్ కోసం చందా కొచ్చర్ అద్భుతంగా కృషి చేశారని, ఆమె ఉత్సాహం, అంకిత భావం గుర్తించదగ్గవని ప్రధాని ట్వీట్ చేశారు.
మరోవైపు, ప్రధాని సూచించిన స్వచ్ఛ భారత్లో పాల్గొన్న చందా కొచ్చర్ మరో ఎనిమిది మందికి ఆహ్వానం పలికారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య, థర్మెక్స్ చైర్ పర్సన్ అను ఆగా, డిజైనర్ అనామికా ఖన్నా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ఎండీ చిత్రా రామకృష్ణ, పిరమాల్ హెల్త్ కేర్ డైరెక్టర్ స్వాతి పిరమాల్, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ రమా బీజాపూర్కర్, ఫేస్బుక్ ఇండియా అధిపతి కీర్తిగా రెడ్డి, నటి విద్యా బాలన్తో పాటు ఐసీఐసీఐ బృందాన్ని ఆహ్వానించారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ అభియాన్లో పలువురు ప్రముఖులు పాల్గొంటున్న విషయం తెలిసిందే. తాజాగా, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ అండ్ సీఈవో చందా కొచ్చర్ మంగళవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కూడా. ఆమెతో పాటు పలువురు ఉద్యోగులు పాలుపంచుకున్నారు. వీరు ముంబైలోని బ్యాక్ బే రిక్లెమేషన్ బ్రాంచ్ ప్రాంతంలో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా చందా కొచ్చర్ మాట్లాడారు.
భారత్ వృద్ధిలో ఐసీఐసీఐ ఎల్లప్పుడు ఉంటుందని చెప్పారు. తాము అనునిత్యం దేశానికి అండగా ఉంటామన్నారు. మోడీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు తనకు ఆనందంగా ఉందని చెప్పారు. ఈ రోజు తాను, తన సహోద్యోగులు తమ బ్రాంచ్ ప్రాంతాన్ని శుభ్రం చేశామన్నారు. ఇది పరిశుభ్ర భారత్ పట్ల తమ చిత్తశుద్ధి అన్నారు.