మోదీ దేశంలోనే అతిపెద్ద విధ్వంసకారుడు... బెంగాల్ గడ్డపై బీజేపీకి సమాధే.. : మమతా ఫైరింగ్ స్పీచ్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీఎంసీ-బీజేపీ మధ్య తీవ్ర మాటల యుద్దం జరుగుతోంది. బెంగాల్ గడ్డపై కాషాయ జెండా పాతేందుకు టీఎంసీని బీజేపీ ముప్పు తిప్పలు పెడుతుండగా... మమతా బెనర్జీ ఏమాత్రం తొణకట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెంగాల్ను బెంగాల్ మాత్రమే పాలిస్తుందని... గుజరాత్ పాలించదని మోదీ,అమిత్ షాలను ఉద్దేశించి మమతా తెగేసి చెప్తున్నారు. బుధవారం(ఫిబ్రవరి 24) బెంగాల్లోని హూగ్లీ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమతా... ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు.
ట్రంప్ కన్నా అధ్వాన్నంగా మోదీ పరిస్థితి : మమతా
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోనే అత్యంత విధ్వంసకారుడని మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఆయన పరిస్థితి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొన్న దానికంటే అధ్వాన్నంగా ఉంటుందన్నారు. 'మోదీ దేశంలోనే అత్యంత హింసాత్మక వ్యక్తి... ట్రంప్ పరిస్థితి ఏమైంది... మోదీ పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంటుంది. హింసతో సాధించేది ఏమీ లేదు.' అని మమతా బెనర్జీ పేర్కొన్నారు.
ఒక రాక్షసుడు,ఒక రావణుడు...
'ప్రస్తుతం ఈ దేశాన్ని ఒక రాక్షసుడు,ఒక రావణుడు నడిపిస్తున్నారని మోదీ,అమిత్ షాలను ఉద్దేశించి మమతా విమర్శించారు. మోదీ,ఆయన రాక్షస స్నేహితుడు చాలా మాట్లాడగలరు... కానీ అదంతా మరో రెండు నెలలు మాత్రమే. ఆ తర్వాత మాట్లాడేది మేమే.. బెంగాల్లో బీజేపీ విజయం అంత సులువు కాదు. కచ్చితంగా ఈ గడ్డపై బీజేపీకి సమాధి కట్టి తీరుతాను. ప్రధాని పదవి పట్ల నాకు గౌరవం ఉంది... ఇవాళ ఆ స్థానంలో మోదీ ఉన్నారు.. రేపు ఉండరు... మోదీ చెప్పేవన్నీ అబద్దాలే..' అని మమతా వ్యాఖ్యానించారు.
బీజేపీ బెంగాల్లో గోల్ కొట్టలేదు...
'బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నేను గోల్ కీపర్ లాంటి వ్యక్తిని.. ఇక్కడ బీజేపీ సింగిల్ గోల్ కూడా కొట్టలేదు. మోదీ టెలీప్రాంప్టర్ సాయంతో బెంగాలీ భాషలో మాట్లాడుతున్నారు. నాకు ఆ అవసరం లేదు. అంతేకాదు,నేను టెలీప్రాంప్టర్ లేకుండా నేను గుజరాతీ కూడా మాట్లాడగలను. బెంగాల్లో మహిళలకు భద్రత కరువైందని మోదీ అంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్లో మహిళలకు భద్రత ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆఖరికి ఆ రాష్ట్రాల్లో బీజేపీ మహిళా నేతలకు కూడా రక్షణ లేదన్నారు. మహిళలందరినీ మేము గౌరవిస్తాం. బెంగాల్ గడ్డ తల్లుల భూమి...' అని మమతా పేర్కొన్నారు.
అసలు ఆట షురూ.. : మమతా
బొగ్గు కుంభకోణంలో తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా బెనర్జీని టార్గెట్ చేస్తూ సీబీఐ అస్త్రం ప్రయోగించడంపై మమతా తీవ్ర స్థాయిలో స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. 'మా అందరినీ అరెస్ట్ చేయండి. నాతో సహా రాష్ట్రంలో 20లక్షల మంది కార్యకర్తలం ఉన్నాం. మీరు నన్ను ఇక్కడ పాతిపెడితే... ఢిల్లీలో ఒక చెట్టునై మళ్లీ పుట్టుకొస్తా... గుర్తుంచుకోండి గాయపడిన పులి అత్యంత ప్రమాదకరమైనది... ఇప్పుడు అసలు ఆట మొదలైంది.' అని మమతా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీని ఓడించగలిగితే... వాళ్లు దేశమంతా కనుమరుగవుతారన్న విషయాన్ని బెంగాల్ ఓటర్లు గుర్తుంచుకోవాలి. బీజేపీ నేతలు డబ్బులు ఇస్తే తీసుకోవాలని.. కానీ ఓటు మాత్రం టీఎంసీకే వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.