వైఎస్ జగన్, కేసీఆర్ సహా: ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని: వార్నింగ్ ఇస్తారా?
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహా భయానకంగా విస్తరిస్తోంది. రోజూ లక్షకు చేరువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 1100 మందికి పైగా ఈ మహమ్మారి వల్ల మృత్యువాత పడుతున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల తప్ప తగ్గే ప్రసక్తే కనిపించట్లేదు. దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా ప్రస్తుతం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. కొత్త కేసుల సంఖ్య దిమ్మతిరిగే రేంజ్లో వెలుగులోకి వస్తున్నాయి.
ప్రత్యేకించి- 10 రాష్ట్రాల్లో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంటోంది. ఈ 10 రాష్ట్రాల జాబితాలో ఏపీ, తెలంగాణ ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత ఉప్పెనలా కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మరోసారి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. కరోనా వైరస్ స్థితిగతులపై ఆరా తీయనున్నారు. రెండు విడతల్లో ఈ భేటీ ఏర్పాటవుతుందని తెలుస్తోంది.
తొలి విడతలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమౌతారని అంటున్నారు. ఈ భేటీ ఈ నెల 23వ తేదీన ఏర్పాటు కావచ్చని సమాచారం. ఏపీ, తెలంగాణ కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొంటారని సమాచారం. తొలి విడతలో ఏడు రాష్ట్రాలతోనూ, మలి విడతలో మిగిలిన ముఖ్యమంత్రులతోనూ నరేంద్ర మోడీ భేటీ అవుతారని అంటన్నారు.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు కావడానికి గల కారణాలపై ప్రధాని ఆరా తీస్తారని, నియంత్రణ కోసం తీసుకుంటోన్న చర్యల గురించీ అడిగి తెలుసుకుంటారని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న కోవిడ్ మార్గదర్శకాల అమలు తీరు, కరోనా పేషెంట్లకు అందుతోన్న చికిత్స, పౌష్టికాహారం, కోవిడ్ కేర్ సెంటర్లలో వైద్య సదుపాయాల గురించి ప్రధాని ఆరా తీస్తారని వెల్లడిస్తున్నాయి.
Recommended Video
చివరిసారిగా నరేంద్ర మోడీ.. కిందటి నెల 11వ తేదన ఏపీ, తెలంగాణ కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాన్ని కొనసాగింపుగా ఈ నెల 23వ తేదీన మరోసారి సమావేశమౌతారని సమాచారం. కరోనా కట్టడిలో విఫలమౌతోన్న ముఖ్యమంత్రులకు మోడీ.. సుతిమెత్తగా హెచ్చరికలను జారీ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.