ఈ టన్నెల్తో కశ్మీరీ వ్యాలీకి సరికొత్త వన్నెలు
భారత దేశంలోనే అతి పొడవైన సొరంగ మార్గ రహదారి ఇది. ఆసియా ఖండంలోనే అతి పొడవైన రెండు మార్గాల సొరంగం.. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణికులు సురక్షితంగా ఈ మార్గాన్ని వినియోగించుకోవచ్చు.
శ్రీనగర్: భారత దేశంలోనే అతి పొడవైన సొరంగ మార్గ రహదారి ఇది. ఆసియా ఖండంలోనే అతి పొడవైన రెండు మార్గాల సొరంగం.. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణికులు సురక్షితంగా ఈ మార్గాన్ని వినియోగించుకోవచ్చు. ఈ టన్నెల్ మార్గంలో ప్రయాణించే వారి కోసం తాజా గాలిని అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు.
జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని చెనాన్-నష్రి ప్రధాన రహదారిలో భాగంగా నిర్మించిన ఈ సొరంగమార్గ రహదారిని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. ఓ సారి ఈ మార్గం ప్రత్యేకతలు పరిశీలిస్తే అబ్బురమనిపిస్తుంది మరి.. మనమూ అటువైపు ఒక లుక్కేద్దాం.
దీనివల్ల రెండు గంటలు ఆదా
ఈ సొరంగ మార్గం జమ్ము, శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయాన్ని రెండు గంటలు తగ్గిస్తుంది. ప్రతి రోజూ రూ.27 లక్షల విలువైన ఇంధనం దీనివల్ల ఆదా అవుతుంది. ఈ మార్గంలో భద్రతకు పెద్దపీట వేశారు. మార్గంలో మొత్తం మీద 124 సీసీటీవీ కెమెరాలను, అత్యాధునిక స్కానర్లను ఏర్పాటు చేశారు. వాహనదారులకు రోడ్డు మార్గం చక్కగా కనపడేలా విద్యుత్దీపాలను ఏర్పాటుచేశారు మరి.
నిర్మాణం పూర్తి ఒక రికార్డే
భారత దేశంలోనే ఇంజినీరింగ్ అద్భుతంగా నిలిచే ఈ మార్గాన్ని నాలుగేళ్ల రికార్డు సమయంలో పూర్తి చేశారు. ఉధంపూర్ జిల్లాలోని చినైనీ.. రాంబన్ జిల్లాలోని నాశరీ మధ్య 9.2 కి.మీ పొడవు ఉన్న మార్గాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం రూ.3720కోట్లు ఖర్చు చేసింది.
తగ్గిన దూరం ఇంత..
జమ్ము, శ్రీనగర్ మధ్య ప్రయాణ దూరం 31 కిలోమీటర్లు తగ్గిపోతుంది. గతంలో ప్రధాన మార్గంలో కొండ చరియలు, మంచు, అధిక ట్రాఫిక్ జామ్తో ఇబ్బంది పడ్డ కశ్మీరీలకు ఈ సొరంగ మార్గం ఎంతో వెసులుబాటు కలిగిస్తుంది. ప్రధాని నరేంద్రమోడీ మాటల్లో చెప్పాలంటే కశ్మీరీ లోయలోని పర్యాటక రంగాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తుందీ టన్నెల్ రూట్. రాష్ట్రంలో మౌలిక వసతులను అభివ్రుద్ధి చేసేందుకు 9 సొరంగ మార్గాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయిస్తే అందులో ఇది మొదటిది కానున్నది.
అత్యాధునిక వ్యవస్థలకు...
అత్యాధునిక నిఘా, వాహనాల కదలికలు తెలియజేసే వ్యవస్థ కలిగిన మార్గాల్లో ప్రపంచంలో ఇది ఆరోది కాగా.. భారత్లో మొదటిది. వాహనాల కదలికల గురించి నిరంతరం పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి ఏర్పాట్లు చేశారు.
ఆ టన్నెల్ రూట్ ఇలా...
ఈ టన్నెల్ రూట్లో రెండు సొరంగ మార్గాలు నిర్మించారు. ఒకటి ప్రధానమైంది కాగా.. రెండోది దానికి సమాంతరంగా నిర్మించిన ఎస్కేప్ టన్నెల్. రెండు టన్నెళ్లు 29 చోట్ల కలిసేలా నిర్మించారు. ప్రతి 300 మీటర్లదూరంలో ఒక టన్నెల్ నుంచి మరో టన్నెల్లోకి మారే వెసులుబాటు ఈ రూట్లో ఉంది కూడా. ఇబ్బందులెదురైతే ఎస్కేప్ టన్నెల్ నుంచి వెళ్లొచ్చు. ట్రాఫిక్ నిబంధనలు పాటించే వారి కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచి ‘ఉల్లంఘనుల' సమాచారం సొరంగం బయట ఉండే ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. 1200 మీటర్ల ఎత్తున ఈ సొరంగ మార్గం నిర్మించడం మరో విశేషం.