రూ. 25 వేల కోట్ల రాయితీ, అమ్మ స్కూటర్ పథకం, ప్రధాని మోడీ హాజరు, కావేరీ సమస్య !
చెన్నై: తమిళనాడులో అమ్మ జయలలిత అమలు చేసిన అనేక పథకాలను ఇంత వరకూ మనం చూశాం. ఇప్పుడు 50 శాతం రాయితీతో మహిళలకు స్కూటర్లు పంపిణి చెయ్యడానికి రంగం సిద్దం అయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శనివారం రూ. 25,000 కోట్ల రాయితీ స్కూటర్ల పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఇదే సమయంలో కావేరీ నీటి సమస్యపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నాయి.
ఉద్యోగం చేసే మహిళలు
2016 శాసన సభ ఎన్నికల సందర్బంగా ఉద్యోగాలు చేసే మహిళలకు 50 శాతం రాయితీతో స్కూటర్లు పంపిణి చేస్తామని జయలలిత ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే హామీ నేరవేర్చకుండానే జయలలిత మరణించారు.
పన్నీర్, పళని
జయలలిత మరణించిన తరువాత సీఎం అయిన పన్నీర్ సెల్వం రెండు నెలలకే రాజీనామా చేశారు. అనంతరం ముఖ్యమంత్రి అయిన ఎడప్పాడి పళనిస్వామి రాయితీ స్కూటర్ల పథకాన్ని తెరమీదకు తీసుకు వచ్చారు. ఇప్పుడు పళనిస్వామి, పన్నీర్ సెల్వం కలిసి అమ్మ హామీ ఇచ్చిన రాయితీ స్కూటర్ల పథకం అమలు చేస్తున్నారు.
3.36 లక్షల మంది
జనవరి 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు తమిళనాడులో ఉద్యోగాలు చేస్తున్న 3,36,000 మంది మహిళలు రాయితీ స్కూటర్ల పథకానికి ధరఖాస్తులు సమర్నించారు. 2018-19 వార్షిక సంవత్సరంలో ఒక లక్ష స్కూటర్లు పంపిణి చెయ్యడానికి తమిళనాడు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది.
జయలలిత జయంతి
జయలలిత 70వ జయంతి శనివారం తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. జయలలిత జయంతి సందర్బంగా రాయితీ స్కూటర్ల పథకం ప్రారంభిస్తున్నారు. రాయితీ స్కూటర్ల పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు.
ప్రధాని మోడీ హాజరు
శనివారం మద్యాహ్నం 3.20 గంటలకు ప్రత్యేక విమానంలో ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి బయలుదేరి సాయంత్రం 5.20 గంటలకు చెన్నై విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి చెన్నైలోని చేపాక్ లోని కలైవానర్ అరంగంలోని మైదానం చేరుకుంటారు. అక్కడ జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ రాయితీ స్కూటర్ల పథకాన్ని ప్రారంభిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా ఏడు మంది మహిళలు స్కూటర్లు అందుకుంటారు.
ప్రధాని, సీఎం, పన్నీర్
ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తున్న రాయితీ స్కూటర్ల పథకం కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్నాడీఎంకే పార్టీ నాయకులు పాల్గొంటున్నారు.
కావేరీ సమస్య
శనివారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీ చెన్నైలోని రాజ్ భవన్ లో బసచేస్తున్నారు. కావేరీ నీటి పంపిణి సమస్యపై అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష నాయకులు ప్రధాని నరేంద్ర మోడీని భేటీ కావాలని ప్రయత్నిస్తున్నారు. ప్రధాని పర్యటన సందర్బంగా చెన్నైలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.