భారతావనికి ప్రతీక: రామ మందిర భూమి పూజ వేళ ఎల్కే అద్వానీ భావోద్వేగ సందేశం
న్యూఢిల్లీ: దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్యలో శ్రీరామ మందిర భూమి పూజ మరికొద్ది గంటల్లో జరగనుంది. ఈ క్రమంలో అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఎంతో శ్రమించిన బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ భావోద్వేగానికి గురయ్యారు.
ఉద్వేగభరిత క్షణాలు..
ఆగస్టు 5న(బుధవారం) రామ మందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం అద్వానీ ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు. తనతోపాటు భారత ప్రజలందరికీ ఇదో చారిత్రక, ఉద్వేగభరిత క్షణాలని వ్యాఖ్యానించారు.
రామ రాజ్యంలా వర్ధిల్లాలి..
1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు తాను చేపట్టిన రథయాత్రను అద్వానీ గుర్తు చేసుకున్నారు. దృఢమైన, సుసంపన్నమైన, శాంతి సామరస్యాలతో కూడిన భారతవానికి రామ మందిరం ఓ ప్రతీకగా నిలుస్తుందని అద్వానీ స్పష్టం చేశారు. అందరికీ సమ న్యాయం, సుపరిపాలన అందాలని, దేశం రామ రాజ్యంలా వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
అది నాకు గౌరవం..
రామ జన్మభూమి ఉద్యమంలో తాను భాగస్వామి కావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని అద్వానీ అన్నారు. భారతీయ సంస్కృతి, నాగరిక వారసత్వంలో శ్రీరాముడికి ఎంతో గౌరవ స్థానం ఉందని చెప్పారు. భారతీయులందరిలో శ్రీరాముడిలోని సద్గుణాలు ప్రేరేపించేందుకు ఈ ఆలయం దోహదపడుతుందని విశ్వసిస్తున్నట్లు అద్వానీ తెలిపారు.
దేశ వ్యాప్తంగా రథయాత్ర..
రామ మందిర నిర్మాణం కోసం అద్వానీ దేశ వ్యాప్తంగా రథయాత్ర కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా, రామ మందిర భూమి కార్యక్రమానికి అద్వానీ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే అద్వానీతోపాటు మరో అగ్రనేత మురళీ మనోహర్ జోషిలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూమి పూజ కార్యక్రమాన్ని వీక్షించనున్నారు.
Recommended Video
అయోధ్యలో పండగ వాతావరణం
ఇది ఇలావుండగా, అయోధ్యలో రామ మందిర భూమి పూజ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. చారిత్రక ఘట్టం నేపథ్యంలో అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో అయోధ్యలో పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని నరేంద్ర మోడీతోపాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ వేదికను పంచుకోనున్నారు. మరో 175 మంది ప్రముఖులను ఆలయ ట్రస్ ఆహ్వానం పంపింది.