ప్రపంచంలో అత్యంత నమ్మదగిన మూడో దేశాధి నేత మోడీ: ఓఈసీడీ రిపోర్ట్
భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో ఘనత సాధించారు. ఇప్పటికే దేశంలో అత్యధిక ప్రజాదరణ నేతగా కొనసాగుతున్న మోడీ.. ఇప్పుడు ప్రపంచంలోనే నమ్మదగిన దేశాధి నేతల్లో మూడో స్థానంలో నిలిచారు.
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో ఘనత సాధించారు. ఇప్పటికే దేశంలో అత్యధిక ప్రజాదరణ నేతగా కొనసాగుతున్న మోడీ.. ఇప్పుడు ప్రపంచంలోనే నమ్మదగిన దేశాధి నేతల్లో మూడో స్థానంలో నిలిచారు. మనదేశంలోని ప్రతీ నలుగురిలో ముగ్గురు ఆయనపై నమ్మకాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.
ఇటీవల తీసుకొచ్చిన సంస్కరణలు, అవినీతిపై పోరాటం, పన్ను సంస్కరణలు భారత ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరిగేలా చేసిందని ఓఈసీడీ నివేదిక పేర్కొంది. గ్యాలుప్ వరల్డ్ పోల్(జీడబ్ల్యూపీ) ఈ సర్వేను నిర్వహించింది. ఒకే ప్రశ్నను నమూనాగా సుమారు వెయ్యి మందికి ఒకే ప్రశ్నను వేయడం జరిగింది.
మీ ప్రభుత్వంపై మీకు నమ్మకం ఉందా? అనే ప్రశ్నను ఆయా దేశాల ప్రజలకు వేసింది. ఆర్థిక పరిస్థితి, రాజకీయం, అవినీతి కేసులు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని, లేదా తీసుకోకుండా ఈ ప్రశ్నకు జవాబును రాబట్టింది.
కాగా, ఇటీవల నిర్వహించిన ప్యూ సర్వే కూడా ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రజాదరణ నేతగా తేల్చింది. ఈ సర్వేలో దేశ ఆర్థిక పరిస్థితి 10కి పది మంది సంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. గత మూడేళ్లలో ఆర్థికాభివృద్ధి బాగుందని సర్వేలో యువత తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.