నేడు మైకు ముందుకు ప్రధాని: జాతిని ఉద్దేశించి ప్రసంగం? కాశ్మీరీ యువతే టార్గెట్!
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారంటే ఏదో బాంబు పేల్చుతున్నట్టే భావిస్తారు దేశ ప్రజలు. ఈ అనుమానాలు రావడానికి ప్రధాన కారణం.. పెద్ద నోట్ల రద్దు వ్యవహారం 2016 నవంబర్ 8వ తేదీన జాతిని ఉద్దేశించిన మాట్లాడిన నరేంద్ర మోడీ.. ఉన్నట్టుండి పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఈ క్షణం నుంచి 1000, 500 రూపాయల నోట్లు చిత్తు కాగితాలతో సమానమని ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రకంపనలు ఏడాది పాటు వెంటాడాయి. తాజాగా- మరోసారి ఆయన మైకు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తోంది.
ఈ సారి ఆయన జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించవచ్చని సమాచారం. జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 రద్దు వ్యవహారం, ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించడం, కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడానికి గల కారణాలను ప్రధాని తన ప్రసంగం ద్వారా దేశ ప్రజలకు వివరించే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం తీసుకున్న ఈ చర్యల వల్ల జమ్మూ కాశ్మీర్ కు కలిగే లాభాలను ఆయన వివరిస్తారని చెబుతున్నారు. దీనితోపాటు- జమ్మూ కాశ్మీర్, లడక్ కేంద్ర పాలిత ప్రాంతాలకు భారీగా వరాలను ప్రకటిస్తారని అంటున్నారు.
కాశ్మీరీ యువతను లక్ష్యంగా చేసుకుని.. వారికి ఉపాధి కల్పించడానికి భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలను గురించి సూచనప్రాయంగా వెల్లడించే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు భారీ ఎత్తున రాయితీలను ప్రకటించడం, స్థానిక యువతకు ఉపాధి కల్పించడానికి అవసరమైన రంగాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని కల్పించడం వంటి నిర్ణయాలను నరేంద్ర మోడీ దేశ ప్రజలకు వివరిస్తారని సమాచారం. ఇప్పటికే కొందరు పారిశ్రామికవేత్తలు జమ్మూ కాశ్మీర్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. స్టీల్ బర్డ్ హెల్మెట్ల తయారీ సంస్థ.. ఆ రాష్ట్రంలో కొత్తగా ప్లాంట్ ను నెలకొల్పబోతోన్న విషయం తెలిసిందే.
జమ్మూ కాశ్మీర్ కు ప్రధాన ఆదాయ వనరు పర్యాటక రంగం. దీన్ని దృష్టిలో ఉంచుకుని పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి 80 నుంచి 90 శాతం వరకు రాయితీలను కల్పిస్తారనే ప్రచారం సాగుతోంది. కాగా- ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ఇది రెండోసారి అవుతుంది. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై ఒకసారి, అంతరిక్షంలో పరిభ్రమించే ఇతర దేశాల ఉపగ్రహాలను కూల్చివేయగల క్షిపణి యాంటీ-శాటిలైట్ మిస్సైల్ (ఎ-శాట్)ని రూపొందించిన సమయంలో రెండోసారి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ రెండూ సందర్భాలు కూడా సంచలనాలన్ని రేపినవే. ఏ మాత్రం ఊహకు అందనివే కావడం గమనార్హం.