తదుపరి రాష్ట్రపతిగా అమితాబ్!: ‘మోడీ ఆలోచనే?’
న్యూఢిల్లీ: ప్రణబ్ ముఖర్జీ తర్వాత భారత రాష్ట్రపతి పదవికి బాలీవుడ్ నటుడు అమితాబ్ పేరును ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తనకు తెలిసిందని సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ ఓ టివీ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రధాని ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు తనకు సమాచారం వుందని అమర్ సింగ్ అన్నారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు అమితాబ్ బచ్చన్ ను తానే పరిచయం చేశానని చెప్పారు. ఆ పరిచయం తరువాతే మోడీ.. అమితాబ్ను గుజరాత్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండాల్సిందిగా కోరారని చెప్పారు.
కొన్ని రోజుల క్రితం బీజేపీ ఎంపీ శత్రుఘ్ను సిన్హా సైతం కాబోయే భారత రాష్ట్రపతిగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పేరును తెరపైకి తీసుకొచ్చారు. ప్రణబ్ ముఖర్జీ తర్వాత బాలీవుడ్ స్టార్ అమితాబ్ రాష్ట్రపతి అయితే తాను చాలా సంతోషిస్తానని ఎంపీ శత్రుఘ్నుసిన్హా అన్నారు.
కల్చరల్ ఐకాన్ బిగ్ బీ భారత్కు ప్రెసిడెంట్ అయితే చాలా గర్వకారణమని వ్యాఖ్యానించారు. సాంఘిక, సాంస్కృతిక రంగాల్లో అమితాబ్ ఎన్నో మైలురాళ్లను అధిగమించారని ఆయన అన్నారు. బిగ్బీ ప్రెసిడెంట్ అయితే దేశానికి చాలా మంచి పేరు వస్తుందన్నారు. కాగా, అమర్ సింగ్ వ్యాఖ్యలపై పలువురు ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా జోక్ చేశారంటూ వ్యాఖ్యానించడం గమనార్హం.