పవార్ బర్త్డే: రాహుల్ గాంధీ, మోడీ షేక్ హ్యాండ్స్
న్యూఢిల్లీ: ఎన్సీపి అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ జన్మదిన వేడుకలు వివిధ పార్టీలకు చెందిన నాయకులను ఒకే వేదిక మీదకు తెచ్చింది. రాజకీయ దిగ్జజ నాయకులు ఆ వేదికపై కలిశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అక్కడే పరస్పరం కరచాలనం కూడా ఇచ్చుకున్నారు.
నమస్తే అంటూ రాహుల్ ప్రధానికి అభివాదం చేశారు. శరద్ పవార్కు 75 ఏళ్లు నిండాయి. ఆ సందర్భంగా ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ప్రముఖ నేతలంతా ఆ పార్టీకి హాజరయ్యారు. సోనియా గాంధీ, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్, అద్వాని, ప్రకాశ్ సింగ్ బాదల్, ములాయం సింగ్ యాదవ్, సీతారాం ఏచూరి కూడా వేడుకకు వచ్చారు.
వీళ్లంతా ఒకే వేదికను పంచుకున్నారు. వ్యాపార దిగ్గజాలు గౌతమ్ అదానీ, అనిల్ అంబానీ, సైరస్ మిస్త్రీ, విజయ్ మాల్యా, మారీన్ వాడియా కూడా హాజరయ్యారు. రైతులు వాతావరణాన్ని అంచనా వేసినట్లు శరద్ పవార్ పరిస్థితులను ముందుగానే పసికట్టేస్తారని, గాలి ఎటు వీస్తుందో అని ఎవరైనా తెలుసుకోవాలంటే, వాళ్లు శరద్ పవార్ దగ్గరుంటే తెలుస్తుందని ప్రధాని మోడీ చమత్కరించారు.
పార్లమెంట్ సజావుగా సాగేందుకు ప్రభుత్వం, విపక్షం పరస్పరం సహకరించుకోవాలని శరద్ పవార్ కోరారు. "మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఆయన మామ లెగ్ స్పిన్నర్, భారత్ తరఫున ఏడు టెస్టు మ్యాచులు కూడా ఆడారు. అది ఆయనపై ప్రభావం చూపే ఉంటుంది" అని సోనియా చేసిన వ్యాఖ్యలకు అందరూ నవ్వేశారు.