పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రధాని మోడీ దీపావళి వేడుకలు: సమస్యాత్మకమైన రాజౌరి సెక్టార్ లో అడుగు
Recommended Video
శ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పాకిస్తాన్ సరిహద్దుల్లో అడుగు పెట్టారు. జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఆయన దీపావళి వేడుకలను నిర్వహించనున్నారు. బాణాసంచాను కాల్చనున్నారు. దీపావళి వేడుకల్లో పాల్గొనడానికి ఆదివారం మధ్యాహ్నం ఆయన రాజౌరి సెక్టార్ కు చేరుకున్నారు. రక్షణపరంగా ఈ సెక్టార్ అత్యంత సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతం ఇది. జమ్మూ కాశ్మీర్ లో వాస్తవాధీన రేఖ (ఎల్ఓసీ)కు ఆనుకుని ఉంటుంది ఈ సెక్టార్. ఇక్కడ దీపావళి వేడుకలను నిర్వహించడాన్ని సాహసోపేత నిర్ణయంగా అభివర్ణిస్తున్నారు భారతీయ జనతాపార్టీ నాయకులు.
దీపావళి వేడుకలను ప్రధానమంత్రి తరచూ సైనిక జవాన్లతో కలిసి జరుపుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది దీపావళి పండుగను మోడీ.. ఉత్తరాఖండ్ లో చైనా సరిహద్దుల్లో నిర్వహించారు. ఇదివరకు కూడా ఆయన పలుమార్లు సరిహద్దు భద్రతా బలగాలతో కలిసి ఈ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. రాజౌరీ వెంటి సమస్యాత్మక ప్రదేశంలో అడుగు పెట్టలేదు. పైగా- వాస్తవాధీన రేఖకు ఆనుకుని ఉండే ప్రాంతానికి వెళ్లి దీపావళిని నిర్వహించుకోవడం ఇదే తొలిసారి. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి ఏడాది అంటే.. 2014లో మోడీ జమ్మూ కాశ్మీర్ లో దీపావళి వేడుకలను నిర్వహించారు.
జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తరువాత నరేంద్ర మోడీ ఆ రాష్ట్రానికి వెళ్లడం ఇదే తొలిసారి. దీనితో ఆయన పర్యటనకు రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఏర్పడింది. ఇదివరకు జమ్మూ కాశ్మీర్ ను సందర్శించడానికి ప్రయత్నించిన ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడిని కూడా శ్రీనగర్ లో అడుగు కూడా పెట్టనివ్వలేదు కేంద్ర ప్రభుత్వం. రాహుల్ గాంధీ, సీతారాం ఏచూరి వంటి బడా నాయకులను సైతం విమానాశ్రయం నుంచే తిప్పి పంపించిన సందర్భాలు ఉన్నాయి.
ఈ సారి ఏకంగా ప్రధానమంత్రే జమ్మూ కాశ్మీర్ లో అడుగు పెట్టడం, అదీ.. దీపావళి వేడుకల కోసం ఏకంగా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాన్ని ఎంచుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అంటున్నారు విశ్లేషకులు. దేశ రాజధాని నుంచి సైనిక విమానంలో బయలుదేరిన మోడీ.. నేరుగా రాజౌరీలోని ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. మరి కొన్ని గంటల్లో ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొంటారు. సరిహద్దు భద్రతా బలగాలు, జవాన్లకు స్వీట్లను పంచి పెడతారని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.