ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు: ఎన్ని దేశాలు, ఎంత ఖర్చంటే.? గణాంకాల్లో తేడాలు?
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలతో దౌత్య సంబంధాలు, వాణిజ్య సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అనేక విదేశీ పర్యటనలు చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, భారతదేశ సంస్కృతీ, సాంప్రదాయాలు, గొప్పతనం గురించి ఆయా దేశాలకు వివరించేవారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ప్రధాని మోడీ విదేశీ పర్యటనలపై ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉన్నాయి.
మోడీ ప్రభుత్వం ఈ హామీలు నిలబెట్టుకుందా? బ్యాంకులో 15 లక్షలు వేశారా?: చిదంబరం
58 దేశాలు.. 517.82 కోట్లు..
అంతేగాక, అనేక విదేశీ పర్యటనలు చేస్తూ ప్రధాని మోడీ.. వేల కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ ఆరోపిస్తుండేవి. ఈ నేపథ్యంలో వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు, అందుకు అయిన ఖర్చుల గురించిన వివరాలు వెల్లడించాలని కొందరు సభ్యులు విదేశీ మంత్రిత్వ శాఖను కోరారు. ఎన్సీపీ ఎంపీ ఫౌజియా ఖాన్ ఈ మేరకు ప్రశ్నించారు. 2015 నుంచి ప్రధాని మోడీ అనేక విదేశీ పర్యటనలు చేశారు.. ఇందుకు ఖర్చు ఎంత అయ్యిందో తెలపాలని కోరారు. ఈ క్రమంలో విదేశీ మంత్రిత్వ శాఖ మంగళవారం సమాధానం ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ 2015 నుంచి 58 దేశాల్లో(కొన్ని దేశాలకు రెండు మూడు సార్లు) పర్యటించారు. ఇందుకు రూ. 517.82 కోట్లు ఖర్చు అయ్యిందని మంత్రి వీ మురళీధరన్ రాజ్యసభలో రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. గతంలో చెప్పిన వ్యయాలకు వ్యత్యాసం ఉండటంపైనా ఆయన స్పందించారు.
గత పార్లమెంటు సమావేశాల్లో ఖర్చ ఇలా..
మార్చి నెలలో జరిగిన పార్లమెంటు సమావేశాల్లో మంత్రి మురళీధరన్ వివరణ ఇస్తూ.. గత ఐదేళ్లలో ప్రధాని విదేశీ పర్యటనలకు సంబంధించిన ఖర్చులను తెలిపారు. సంచిత మొత్తం రూ. 446.52 కాగా.. 2015-16లో రూ. 121.85 కోట్లు, 2016-17లో రూ. 78.52 కోట్లు, రూ. 2017-18లో రూ. 99 కోట్లు, 2018-19లో రూ. 100.02 కోట్లు, 2019-20లో రూ. 46.23 కోట్లు అని వివరించారు.
సమాధానాల్లో తేడా ఎందుకంటే..?
అయితే, పీఎం ఇండియా వెబ్సైట్ ప్రకారం.. ఈ ఏడాది ప్రధాని మోడీ ఎలాంటి విదేశీ పర్యటనలు చేయలేదు. కాగా, వర్షాకాల సమావేశంలో విదేశీ మంత్రిత్వ శాఖ రూ. 571.82 కోట్లు చెప్పడం గమనార్హం. ఈ లెక్కలో 125.30 కోట్లు పెరగడం గమనార్హం. కానీ, ఈ పెరుగుదలకు కారణం కూడా ఉంది. 2019లో ప్రధాని చేసిన విదేశీ పర్యటనలకు సంబంధించిన బిల్లులు 2020 లాక్డౌన్ సమయంలో వచ్చి ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
Recommended Video
1583 కోట్ల తేడా ఎందుకంటే..
ఇది ఇలావుంటే, 2018 శీతాకాల సమావేశాల్లో అప్పటి విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వీకే సింగ్ మాట్లాడుతూ.. 2014 నుంచి మోడీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు మొత్తం రూ. 2021 కోట్లు అని తెలిపారు. వీకే సింగ్ చెప్పిన దాని ప్రకారం ఇప్పటి లెక్కతో పోల్చుకుంటే రూ. 1583.18 కోట్లు తేడా వస్తుంది. అయితే, ఆ మొత్తం కూడా ప్రధాని ఉపయోగించిన విమానం మెయింటనెన్స్ కావడం గమనార్హం. 2014, జూన్ 15 నుంచి డిసెంబర్ 3, 2018 వరకు చార్టర్ ఫ్లైట్ల ఖర్చు రూ. 429.25 కోట్లు అని, ఇక హాట్ లైన్ ఖర్చులు రూ. 9.11 కోట్లు అని వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటి వరకు 48 విదేశీ పర్యటనలు చేసి 55 దేశాలను సందర్శించారు. పీఎం ఇండియా వెబ్ సైట్ ప్రకారం మరో 11 విదేశీ పర్యటనలు చేపట్టినట్లు తెలుస్తోంది. గత నవంబర్ లో ప్రధాని మోడీ బ్రెజిల్ దేశంలో పర్యటించారు. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ 8న ఈ వెబ్సైట్ అప్ డేట్ చేయబడింది. ఇప్పటి వరకు బ్రెజిల్ పర్యటనకు సంబంధించిన బిల్లులు రాలేదని తెలుస్తోంది.