గర్వంగా ఉంది: భద్రతా దళాలపై ప్రధాని మోడీ
పఠాన్కోట్: పఠాన్కోట్ ఎయిర్బేస్పై గత శనివారం దాడిచేసిన ఉగ్రవాదులను తుదముట్టించడంలో భద్రతాదళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలను చూసి గర్విస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం పఠాన్కోట్ ఎయిర్బేస్ను సందర్శించి తాజా పరిస్థితిని సమీక్షించారు.
ఉగ్రవాదులు దాడిచేసిన తీరు, భద్రతాదళాలు తుదముట్టించడానికి నాలుగు రోజులు సమయం పట్టడంపైన ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించడమేకాక పాక్ పట్ల మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కూడా తీవ్రంగా తప్పుబట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ శనివారం ఎయిర్ బేస్ను సందర్శించారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కలిసి ఢిల్లీనుంచి నేరుగా పఠాన్కోట్ ఎయిర్బేస్కు వచ్చిన ప్రధానికి వైమానిక దళ ప్రధానాధికారి అరుప్ రాహా, జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జి) అధికారులు దాడి జరిగిన తీరును, ఉగ్రవాదులపై భద్రతా దళాలు జరిపిన ఎదురుదాడి గురించి మ్యాప్లు, గగనతలం నుంచి తీసిన ఫోటోలు, ఆపరేషన్కు సంబంధించిన చిత్రాల సాయంతో వివరించినట్టు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్, ఎన్ఎస్జి, బిఎస్ఎఫ్ చీఫ్లు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి తీసుకున్న నిర్ణయం, దాన్ని అమలుచేసిన తీరుపట్ల పూర్తి సంతృప్తి చెందినట్టు ఎయిర్బేస్ సందర్శన అనంతరం మోదీ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. ‘వివిధ దళాల మధ్య పూర్తి సమన్వయమున్న విషయాన్ని కూడా గమనించాను.
దాడి సమయంలో మన వాళ్లు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, కృతనిశ్చయాన్ని చూసి గర్విస్తున్నాను' అని మరో ట్వీట్లో ప్రధాని అన్నారు. ప్రధాని ఎయిర్బేస్లో ఉగ్రవాదులు దాడిచేసిన ప్రాంతాలన్నిటినీ తిరిగి చూశారు. భద్రతాదళాల దాడిలో మృతిచెందిన ఆరుగురు ఉగ్రవాదులనుంచి పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా అధికారులు ఆయనకు చూపించారు.
ఉగ్రవాదుల దాడిలో ఏడుగురు భద్రతాదళ జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు తొలుత భద్రతా దళాలతో కాల్పులకు దిగిన మిలిటరీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రాంతాన్ని, తర్వాత భద్రతా దళాలు పేల్చి వేసిన వైమానిక దళ సిబ్బంది బస చేసే రెండస్తుల భవనాన్ని కూడా అధికారులు ప్రధానికి చూపించారు.
ఈ భవనాన్ని పేల్చివేయడంతో అందులో దాగివున్న ఇద్దరు ఉగ్రవాదులు హతమైన విషయం తెలిసిందే. అనంతరం ప్రధాని పఠాన్కోట్కు కొద్ది మైళ్ల దూరంలోని భారత్- పాక్ సరిహద్దుల్లోని భారత దళాల స్థావరాల ఏరియల్ సర్వేకు బయలుదేరి వెళ్లారు.