నిద్రను సైతం త్యాగం: సోషల్ మీడియాపై స్టూడెంట్ కామెంట్స్: నిజంగా లక్కీ: విద్యార్థులతో మోడీ
న్యూఢిల్లీ: రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా కొందరు ఎంపిక చేసిన విద్యార్థులతో ఫోన్లో సంభాషించారు. వారి అభిరుచులను తెలుసుకున్నారు. లక్ష్యాన్ని అందుకోవడానికి అహర్నిశలు కృషి చేయాల్సిన అవసరం ఉంటుందని గుర్తు చేశారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడే సమాజంలో ఉన్నత స్థితికి చేరుకోగలమని ప్రధాని వారికి సూచించారు. హర్యానాలోని పానిపట్కు చెందిన విద్యార్థిని కృతిక నందాల్, కేరళలోని ఎర్నాకుళానికి చెందిన విద్యార్థి వినాయక్, ఉత్తర ప్రదేశ్లోని అమ్రోహాకు చెందిన ఉస్మాన్ సైఫీ, తమిళనాడులోని నామక్కాల్కు చెందిన కృతికాతో మాట్లాడారు మోడీ.
డాక్టర్ కావాలంటూ..
భవిష్యత్తులో తాను డాక్టర్ కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు కృతికా నందాల్ వివరించారు. మోడీతో ఆమె ఫోనులో మాట్లాడారు. తల్లిని తాను స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పారు. పాఠశాల స్థాయిలో క్రీడల్లో పాల్గొన్నట్లు చెప్పారు. దీనికి మోడీ బదులిస్తూ.. ప్రాణాలను నిలబెట్టే డాక్టర్ వృత్తిని ఎంచుకోవడం సాహసంతో కూడుకున్నదని అన్నారు. డాక్టర్ వృత్తిని ఎంచుకోవడమంటే జీవితాన్ని సమాజానికి త్యాగం చేసినట్టవుతుందని చెప్పారు. డాక్టర్లు సుఖ సంతోషాలను త్యాగం చేస్తున్నారని అన్నారు. చివరికి నిద్రను కూడా వదులుకునే పరిస్థితులు వస్తాయని మోడీ అన్నారు.
సోషల్ మీడియాకు దూరంగా ఉండటం లక్కీ..
అనంతరం కేరళలోని ఎర్నాకుళానికి చెందిన వినాయక్తో ప్రధాని మాట్లాడారు. తాను బాస్కెట్ బాల్ క్రీడాకారుడిగా గుర్తింపు పొందానని వినాయక్ ప్రధానికి వివరించారు. బాస్కెట్ బాల్ తరఫున తాను కేరళ, తమిళనాడుల్లో నిర్వహించిన టోర్నమెంట్లకు తన స్కూల్ తరఫున ప్రాతినిథ్యాన్ని వహించానని అన్నారు. దీని పట్ల మోడీ ఆ విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరింత రాణించాలని అకాంక్షించారు. సోషల్ మీడియాకు తాను దూరంగా ఉన్నానని వినాయక్ చెప్పడంతో మోడీ బిగ్గరగా నవ్వారు. అలా ఉండటం లక్కీ అని వ్యాఖ్యానించారు.
వేదిక్ మేథమేటిక్స్ గురించి..
ఉత్తర ప్రదేశ్లోని అమ్రోహాకు చెందిన ఉస్మాన్ సైఫీ అనే విద్యార్థితో నరేంద్ర మోడీ ముచ్చటించారు. అతని అభిరుచులను అడిగి తెలుసుకున్నారు. తనకు మేథమేటిక్స్ పట్ల అత్యంత ఆసక్తి ఉందని ఉస్మాన్ వివరించారు. ఖాళీ సమయాల్లో కూడా మేథమేటిక్స్ గురించి తెలుసుకుంటూ ఉంటానని ఉస్మాన్ చెప్పారు. దీనికి మోడీ బదులిస్తూ.. ఆన్లైన్ వేదిక్ మేథమేటిక్స్ గురించి వివరించారు. వేదిక్ మేథమేటిక్స్ ద్వారా లెక్కల్లో ఉన్న చిక్కులను సులభంగా పరిష్కరించవచ్చని అన్నారు.
వణక్కం అంటూ..
తమిళనాడు నామక్కల్కు చెందిన కణికతో మోడీ మాట్లాడారు. వణక్కం అంటూ తన సంభాషణను ఆయన ప్రారంభించారు. నామక్కల్ అంటే మొట్టమొదటగా తనకు ఆంజనేయ స్వామి విగ్రహం గుర్తుకు వస్తుందని మోడీ చెప్పారు. నామక్కల్లో 18 అడుగుల ఎత్తు ఉండే హనుమంతుడి విగ్రహం ఫేమస్. కణికతో మాట్లాడుతున్న సందర్భంగా ఆమె అభిరుచి ఏమిటని మోడీ అడగ్గా.. డాక్టర్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు. తన తండ్రి ఓ డ్రైవర్ అని చెప్పారు. ఓ డ్రైవర్గా ఉంటూ తన కుమార్తెలను ఉన్నత చదువులను చదివిస్తోన్న కణిక తండ్రికి, కుటుంబ సభ్యులకు మోడీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
Recommended Video
సురినామ్తో ప్రాచీన సంబంధం..
ఆఫ్రికాలోని ఓ చిన్న దేశం సురినామ్తో ప్రాచీన సంబంధాలు ఉన్నాయని అన్నారు. భారతీయులు అక్కడ స్థిరపడ్డారని అన్నారు. సురినామ్ రాష్ట్రపతిగా భారత మూలాలు ఉన్న చంద్రికా ప్రసాద్ సంతోఖీ ప్రమాణ స్వీకారం చేశారని చెప్పారు. ఓ భారతీయుడు అత్యున్నత దేశ పదవిని అందుకున్నారని ప్రశంసించారు. ఆయనకు తన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రికా ప్రసాద్.. వేదాల సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారని, ఈ సందర్భంగా ఆయన సంస్కృత శ్లోకాలను వినిపించారని చెప్పారు. సురినామ్ అధికారిక భాషల్లో భోజ్పురి కూడా ఒకటిగా ఉందని అన్నారు.