"బ్లెయిర్ హౌస్"లో మోడీ బస, బ్లెయిర్ హౌస్ ప్రత్యేకతలు
న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటన సందర్భంగా ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకోబోతున్నారు. అమెరికా అధ్యక్షుడి అతిధిగృహం అయిన "బ్లెయిర్ హౌస్"లో మోడీ బస చేస్తారు. ఈ అతిధి గృహానికి అమెరికా రాజకీయ, దౌత్య, సాంస్కృతిక చరిత్రలో చిరకాల అనుబంధం పెనవేసుకుని ఉంది.
ఈ నెల 29న నరేంద్ర మోడీ వాషింగ్టన్ చేరుకోగానే ఈ అతిధిగృహానికే వెళతారు. తొమ్మిదేళ్ల క్రితం అప్పటి ప్రధాని మన్మోహాన్ సింగ్ తన అమెరికా పర్యటనలో "బ్లెయిర్ హౌస్"లోనే బస చేశారు. 190 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ భవంతి వాస్తవానికి ఒక ప్రయివేట్ నివాసం.
రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా ప్రభుత్వం దీన్ని కొనుగోలు చేసినప్పటి నుంచీ అధ్యక్షుడి అతిధి గృహంగానే కొనసాగుతూ వస్తోంది. రెండో ప్రపంచ యుద్ధానంతరం అప్పటి అమెరికా అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్ కార్యకలాపాలకు ఇదే కేంద్రంగా మారింది. అదే సమయంలో అమెరికా-రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. అమెరికా అధ్యక్ష పదవిలో ఎవరు ఉన్నా.. తమ విదేశీ దౌత్య కార్యకలాపాలకు దీనినే వేదికగా చేసుకుంటారు.
సెప్టెంబర్ 26 మధ్యాహ్నం తర్వాత న్యూయార్క్ చేరుకోనున్న నరేంద్ర మోడీ నేరుగా మన్హాటన్ లోని "న్యూయార్క్ ప్యాలెస్" హోటల్లో బస చేస్తారు. 27వ తేదీ ఉదయం అక్కడ తీవ్రదాడుల దాడిలో ధ్వంసమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాంతం "గ్రౌండ్ జీరో"ను సందర్శిస్తారు.
2001నాటి తీవ్రవాదుల బాధితుల గౌరవార్దం నిర్మించిన స్మారక ప్రదర్శనశాలను సందర్శిస్తారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో సహా పలువురితో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గోంటారు. అదే సాయంత్రం సెంట్రల్ పార్కులో జరిగే "గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్" కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇక 28న యూదుల బృందాలతో సమావేశమౌతారు. తర్వాత ప్రసిధ్ది చెందిన మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగే భారీ ర్యాలీలో భారత సంతతి అమెరికన్లను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు. న్యూయార్క్ నుంచి 29న వాషింగ్టన్ చేరుకునే మోడీ గౌరవార్దం అమెరికా అధ్యక్షుడు ఒబామా రాత్రి విందునిస్తారు.
దీంతో ఒబామా, మోడీ ఇద్దరూ ముఖాముఖిగా కలుసుకునే సందర్బం ఇది. 30వ తారీఖున ఇరు దేశాల మధ్య శిఖరాగ్ర సమావేశం జరగనుంది. అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ అదేరోజు (30)న మధ్యాహ్నాం మోడీకి విందు ఇస్తారు. వర్కింగ్ లంచ్గా పేర్కొంటున్న ఈ విందు అనంతరం మోడీ నేరుగా కేపిటాల్ హిల్కు చేరుకుంటారు.
ప్రతినిధుల స్పీకర్ జాన్ బోహెనర్ తో సమావేశం అవుతారు. ఈ కార్యక్రమాలతో పాటు అదే రోజు వాషింగ్టన్ డీసిలో అమెరికా - భారత్ వాణిద్య మండలి నిర్వహించే కార్యక్రమంలో వ్యాపారవేత్తలను కలుసుకుంటారు. అక్కడి భారత రాయబార కార్యాలయం ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటిస్తారు.