పాక్ ప్రధాని షరీఫ్ తల్లికి మోడీ పాదాభివందనం
న్యూఢిల్లీ: పాక్లో ఆకస్మిక పర్యటించిన భారత ప్రధాని నరేంద్రమోడీకి అపూర్వ స్వాగతం, ఆతిథ్యం లభించింది. పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్, మోడీ కోసం ప్రత్యేక వంటకాలను తయారు చేయించారు. శుక్రవారం సాయంత్రం లాహోర్ నగర శివారు రాయ్విండ్లోని నవాజ్ షరిఫ్కు చెందిన జతీ ఉమ్రాహ్ ప్యాలెస్కు ప్రధాని మోడీ వెళ్లారు.
పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్ కొడుకు హాసన్, ఇతర కుటుంబ సభ్యులు ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. షరీఫ్ తన కుటుంబ సభ్యులను మోడీకి పరిచయం చేశారు. అనంతరం ఇరు దేశాల ప్రధానులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పాక్ ప్రధాని తల్లి అక్కడికి రాగా మోడీ ఆమెకు పాదాభివందనం చేసినట్లు పాక్ వర్గాలు తెలిపాయి.
పాక్ ప్రధాని నవాజ్ షరిఫ్ తన నివాసంలో మోడీకి ఏర్పాటు చేసిన విందులో ఆయనకు ఇష్టమైన పాలకూరతో పాటు సాగ్, దాల్, శాకాహార వంటకాలను వండించారు. ప్రధాని మోడీకి ప్రత్యేకంగా కశ్మీరీ టీ అందజేశారు. శుక్రవారం షరిఫ్ పుట్టిన రోజుతో పాటు ఆయన మనవరాలు మొహ్రున్నిసా వివాహం కావడంతో మనవరాలికి మోడీ తన ఆశీస్సులను తెలిపారు.
ముందుగా లాహోర్ వెళ్లిన మోడీకి విమానాశ్రయంలో నవాజ్ షరీఫ్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఇద్దరూ ప్రత్యేక హెలికాప్టర్లో లాహర్లోని నవాజ్ షరీఫ్ నివాసానికి వెళ్లారు. షరీఫ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోడీ, అనంతరం లాహోర్ నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు.
తెలుగు వన్ఇండియా