పెద్దనోట్లు రద్దు చేసినట్లే దీన్ని కూడా రద్దు చేస్తాడేమో: మోడీపై రాహుల్ నిప్పులు
దేశం మొత్తాన్ని చౌకీదారులుగా ప్రధాని నరేంద్ర మోడీ మార్చారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాందీ. ప్రధాని నరేంద్ర మోడీతో సహా, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఇతర బీజేపీ నాయకులు తమ ట్విటర్ ప్రొఫైల్ పేరుకు చౌకీదార్ అని చేర్చడంతో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఈ మధ్య ఎక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించినా అక్కడ మోడీ లక్ష్యంగా తన ప్రసంగం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే కాపలాదారుడు దొంగగా మారారని మోడీపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు.
ఉత్తర కర్నాటకలోని ఓ బహిరంగసభలో ప్రసంగించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానిపై నిప్పులు చెరిగారు. తనను దేశానికి కాపలాదారుడిగా చేయాలని చెప్పిన మోడీ.... ఇప్పుడు దేశం మొత్తాన్ని చౌకీదార్లుగా మారుస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్రమోడీ అనిల్ అంబానీ, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు మాత్రమే కాపలాదారుడిగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే మోడీ శనివారం బీజేపీ కార్యకర్తలను, మద్దతుదారులను " నేను కూడా చౌకీదారే" అని ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరారు. తనతో పాటు దేశం మొత్తం కూడా అవినీతి, సామాజిక రుగ్మతలపై పోరు చేయాలని పిలుపునిచ్చారు.
కన్ఫ్యూజ్ చేయకండి: కాంగ్రెస్ పార్టీ ఆఫర్పై మాయావతి తీవ్ర హెచ్చరిక
ఇక మైభీ చౌకీదార్ పేరుతో ఒక వీడియో కూడా ప్రధాని మోడీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాను దేశానికి కాపలాదారుడునని చెప్తూ ఉన్న సందేశం అందులో ఉంది. దేశంలో అవినీతిని అరికడతానని, అవినీతి జరగకుండా చూసే బాధ్యత తనదని మూడునిమిషాలు నిడివి ఉన్న వీడియోలో మోడీ చెప్పారు. ఇక కర్నాటకలో ప్రసంగించిన రాహుల్ గాంధీ.... మోడీ ఎలాగైతే పెద్దనోట్లను రద్దు చేశాడో... అలానే రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారని రాహుల్ విమర్శించారు.