కరోనా మహమ్మారి ఇంకా పోలేదు, సిద్ధంగా ఉండాలి: ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరిక
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ తగ్గుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి దేశ ప్రజలను అప్రమత్తం చేశారు. వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదన్నారు. ఎప్పుటికప్పుడు రూపు మార్చుకుంటున్న కరోనావైరస్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ మహమ్మారి ఎంత ప్రమాదకర సవాళ్లను విసరగలదన్నది రెండో వేవ్ ద్వారా అర్థమైందన్నారు.
లక్షకుపైగా ఫ్రంట్లైన్ వారియర్స్కు శిక్షణ..
దేశ వ్యాప్తంగా సుమారు లక్షకుపైగా కరోనా ఫ్రంట్లైన్ వారియర్లు నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఉద్దేశించిన స్వల్పకాలిక కోర్సును శుక్రవారం ప్రధాని మోడీ ప్రారంభించారు. భవిష్యత్లో కరోనా మహమ్మారితో రానున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ కోర్సు రూపోందిందని తెలిపారు. దేశ వ్యాప్తంగా 26 రాష్ట్రాల్లోని 111 సెంటర్లలో ఈ కోర్సును ప్రారంభించారు. రెండు నుంచి మూడు నెలల వ్యవధి గల ఈ కోర్సు ఆరోగ్య రంగానికి, ఫ్రంట్లైన్ వారియర్లకు కొత్త జవజీవాలను ఇస్తుందన్నారు.
కరోనా నేర్పిందదే..
హోంకేర్ సపోర్ట్, బేసిక్ కేర్ సపోర్ట్, అడ్వాన్స్డ్ కోర్ సపోర్ట్, ఎమర్జెన్సీ కేర్ సపోర్ట్, శాంపిల్ కలెక్షన్ సపోర్ట్, మెడికల్ ఎక్విప్మెంట్ సపోర్ట్.. అనే 6 కీలక విధుల్లోని ఫ్రంట్లైన్ వారియర్లకు ఉపయోగపడేలా ఈ కోర్సును రూపొందించినట్లు వివరించారు. నైపుణ్యాలను పరిస్థితులకు అనుగుణంగా మెరుగుపర్చుకోవాల్సిన అవసరాన్ని కరోనా మనకు తెలియజేసిందన్నారు. కాగా, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0లో భాగంగా రూ. 276 కోట్లతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఆరోగ్య రంగంలో మానవ వనరుల ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను తీర్చేలా ఈ కోర్సును రూపొందిందని పేర్కొంది. అలాగే యువతకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తుందన్నారు.
ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలపై ప్రధాని ప్రశంసలు
భారత్లో వైద్య నిపుణుల అవసరం చాలా ఉందని, జనాభాతో పోలిస్తే వైద్యులు, నర్సులు, పారామెడిక్స్ సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. అందువల్లే ఏడేళ్లలో కొత్తగా ఎయిమ్స్లను, మెడికల్ కాలేజీలను, నర్సింగ్ కాలేజీలను పెంచేందుకు చర్యలు తీసుకున్నామని ప్రధాని మోడీ తెలిపారు. వైద్య విద్యలో సంస్కరణలను కూడా తెచ్చామన్నారు. ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలను ప్రధాని ప్రశంసించారు. జూన్ 21 నుంచి దేశంలో 18 ఏళ్ల వయస్సుపైబడిన అందరికీ ఉచిత టీకా ఇవ్వడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో మెడికల్ ఆక్సిజన్ లభ్యత విషయంలో ఎదుర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, త్వరలో దాదాపు ప్రతి జిల్లాలో మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా యుద్ధ ప్రాతిపదికన 1500 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని మోడీ వివరించారు.