సాగు చట్టాలకు మోడీ సమర్ధన- కాంగ్రెస్ యూటర్న్-మన్మోహన్ను చూసి నేర్చుకోవాలంటూ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై విపక్షాల నుంచి ఎదురవుతున్న విమర్శలకు ప్రధాని మోడీ ఇవాళ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల నేపథ్యంలో రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చలో పాల్గొన్న మోడీ .. ఈ చట్టాలను పూర్తిగా సమర్ధించుకున్నారు. పాత విషయాలను ప్రస్తావిస్తూ విపక్షాలను కౌంటర్ చేస్ ప్రయత్నం చేశారు.
Recommended Video
సాగు చట్టాలపై రాజ్యసభలో మాట్లాడిన ప్రధాని మోడీ.. ఢిల్లీలో చేస్తున్న నిరసనలను విరమించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఆందోళనలు విరమించాలని, చట్టాలపై తాము కూర్చుని మాట్లాడుకుందామని ప్రతిపాదన చేశారు. మనం ముందుకు సాగాలని, వెనక్కి కాదని, ఈ సంస్కరణలు అందుకు ఊతమిస్తాయని రైతులను ఉద్దేశించి ప్రధాని వ్యాఖ్యానించారు. 1971 తో పోలిస్తే ఇప్పటివరకూ దేశంలో చిన్న, సన్నకారు రైతులు 51 నుంచి 68 శాతానికి పెరిగారని, ప్రస్తుతం వీరి సంఖ్య 86 శాతం ఉందన్నారు. వీరికి ఒక్కొక్కరికీ రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి మాత్రమే ఉందన్నారు. అంటే దేశ జనాభాలో 12 కోట్ల మంది రైతులపై మిగతా వారికి బాధ్యత లేదా అని ప్రధాని ప్రశ్నించారు.
ప్రతీ ప్రభుత్వం రైతుల గురించి, సంస్కరణల గురించి మాట్లాతుందని కానీ కొందరు యూటర్న్ తీసుకున్నారంటూ కాంగ్రెస్ పార్టీని ఉద్ధేశించి మోడీ వ్యాఖ్యానించారు. విపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా అభివృద్ధి కోసం సంస్కరణలు తప్పవని చెప్పాల్సిందేనంటూ మోడీ సూచించారు. విపక్ష కాంగ్రెస్ పార్టీ తన వాదన వినకపోయినా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వాదన వినాల్సిందేనని మోడీ తెలిపారు. ఎప్పుడో 1930ల్లో ఏర్పాటు చేసిన మార్కెటింగ్ విధానాలే ఇప్పటికీ అమలవుతున్నాయని, వాటిని మార్చడం ద్వారా రైతులకు మేలు చేయాలన్నదే తమ అభిమతమని మోడీ వెల్లడించారు.