తెలంగాణ ఏర్పాటుపై మోదీ అనూహ్య వ్యాఖ్యలు.. ఆరోజు పార్లమెంటులో జరిగింది ఎవరూ మర్చిపోలేరన్న ప్రధాని
Recommended Video
తెలుగు రాష్ట్రాలు విడిపోయి ఆరేళ్లు గడుస్తున్నా.. ఆనాడు పార్లమెంటులో ఏపీ విభజన చట్టం ఆమోదం పొందిన తీరును దేశప్రజలెవరూ మర్చిపోలేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రభుత్వం తరఫున గురువారం సమాధానమిచ్చిన ఆయన.. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ అనుసరించిన విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.
రాజ్యసభ ప్రసంగంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తదితర అంశాలను మోదీ ప్రస్తావించిన సమయంలో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు, విమర్శలు చేయడంతో ప్రధని ఘాటుగా బదులిచ్చారు. ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంటులో కనీస చర్చ కూడా జరపకుండా జమ్మూకాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి రద్దు చేశారని, దాందో ఆరు నెలలుగా అక్కడి ప్రజలు నిర్బంధంలో మగ్గిపోతున్నారని కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. ఆజాద్ ఆరోపణల్ని తప్పుపట్టిన ప్రధాని మోదీ.. ఆర్టికల్ 370పై చర్చను దేశమంతా చూసిందని గుర్తుచేశారు.
''సభాసాంప్రదాయాలపై ఆజాద్ లాంటి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం వింతగా అనిపిస్తుంది. ఈ సందర్భంలో నాకు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ గుర్తుకొస్తోంది. ఆరోజు పార్లమెంటులో కార్యకలాపాలు ఎలా జరిగాయో సభ్యులకు గుర్తుండే ఉంటుంది. సభ తలుపులు మూసేసి, ప్రత్యక్ష ప్రసారాల్ని నలిపేసి.. లోపల ఏం జరుగుతుందో తెలియకుండా హడావుడిగా ప్రక్రియను పూర్తిచేశారు''అని మోదీ మండిపడ్డారు.
తెలంగాణ కోసం ఎన్నో ఆందోళనలను జరిగాయని, వాజపేయి హయాంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటుచేసిన పార్టీగా బీజేపీ కూడా తెలంగాణను సమర్థించిందని మోదీ గుర్తుచేశారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటులో బీజేపీ అన్ని నిబంధనల్ని పాటిస్తే.. కాంగ్రెస్ మాత్రం తెలంగాణ విషయంలో రూల్స్ కు, రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించిందని ప్రధాని ఆరోపించారు.
అంతకుముందు లోక్ సభలోనూ ప్రసంగించిన ప్రధాని మోదీ.. సీఏఏపై ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, ముస్లింలకు లేనిపోని భయాలు క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు. ఇతర దేశాల నుంచి వచ్చే హిందూ శరణార్థులను.. అక్రమంగా ప్రవేశించిన చొరబాటుదారులతో పోల్చొద్దని, పొరుగు దేశాల్లో మతపీడను తట్టుకోలేక ఇండియాకు వచ్చినవారికి పౌరసత్వం కల్పించేదే సీఏఏ అని మోదీ స్పష్టం చేశారు.