కశ్మీర్లో చేసింది పుదుచ్చేరిలో చేయలేకపోతున్నాం- ప్రధాని మోడీ నిస్సహాయత
దేశంలో ప్రజాస్వామ్యం లేదంటూ కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు ప్రధాని మోడీ ఇవాళ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జమ్మూ కశ్మీర్లో తాజాగా నిర్వహించిన జిల్లా అభివృద్ధి కౌన్సిళ్ల ఎన్నికలను ప్రస్తావిస్తూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని గుర్తుచేసారు. అదే సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో స్ధానిక ఎన్నికలు నిర్వహించలేకపోవడంపై ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.
జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏడాదికి స్ధానిక జిల్లా అభివృద్ధి కౌన్సిళ్ల ఎన్నికలు నిర్వహించామని, ఇందులో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారని మోడీ గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పాలిత పుదుచ్చేరిలో మాత్రం పదేళ్లుగా స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ పదేళ్లుగా పుదుచ్చేరిలో స్ధానిక ఎన్నికలు నిర్వహించాలని అక్కడి అధికార యంత్రాంగాన్ని అడుగుతున్నా ఇప్పటికీ అది సాధ్యం కాలేదన్నారు.
2006 నుంచి కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో వివిధ కారణాలతో స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించలేదు. 2018లో సుప్రీంకోర్టు సైతం స్ధానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. 2011లోనే ఇక్కడ అన్ని స్ధానిక సంస్ధల పదవీకాలం పూర్తయింది. కేంద్రం తాజాగా రాయ్ థామస్ను అక్కడ ఎన్నికల అధికారిగా పంపింది. ఆయన ఆధ్వర్యంలో అయినా పుదుచ్చేరిలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరుగుతాయని కేంద్రం ఆశాభావంగా ఉంది.