పోలీస్ జీపు కోసం ప్రధాని సోదరుడి ధర్నా!
జైపూర్ : ప్రధాని నరేంద్రమోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ధర్నాకు దిగారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందికి స్పెషల్ వెహికిల్ కేటాయించాలంటూ ధర్నా చేపట్టారు. జైపూర్ - అజ్మీర్ నేషనల్ హైవేలోని బగ్రు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. దాదాపు గంట పాటు నిరసన తెలిపారు.
మోడీని గద్దె దింపాల్సిందే.. అవసరమైతే రాహుల్ను ప్రధానిని చేద్దామన్న దీదీ?
రాజస్థాన్ పర్యటన నిమిత్తం ప్రధాని సోదరుడు ప్రహ్లాద్ మోడీ జైపూర్కు చేరుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆయనకు స్థానిక పోలీసులు ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించారు. నిబంధనల ప్రకారం వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఎవరికైతే రక్షణ కల్పిస్తున్నారో ఆ వాహనంలోనే వెళ్లాలి. కానీ ప్రహ్లాద్ మోడీ మాత్రం అందుకు అంగీకరించలేదు.
భద్రతా సిబ్బందిని తన వాహనంలో తీసుకెళ్లేందుకు ప్రహ్లాద్ మోడీ నిరాకరించారు. వారి కోసం ప్రత్యేకంగా మరో పోలీస్ జీపును కేటాయించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కుదరదని చెప్పడంతో బయటకు వచ్చిన ఆయన.. స్టేషన్ ఎదుట బైఠాయించారు. దాదాపు గంట పాటు ఆందోళన కొనసాగించారు. చివరకు పోలీసులు సర్దిచెప్పడంతో భద్రతా సిబ్బందిని తన వాహనంలోనే ఎక్కించుకుని వెళ్లిపోయారు.