మూడుకు పడిపోతున్నామా: కావూరితో మన్మోహన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ బలం 33 నుంచి 3కి పడిపోతుందా అని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సందేహం వ్యక్తం చేసినట్లు శుక్రవారం మీడియాలో వార్తలు వచ్చాయి. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా సమర్పించేందుకు గురువారం ఉదయం ప్రధాని మన్మోహన్ను కావూరు సాంబశివరావు కలిశారు. ఈ సందర్భంగా ఇరువురికి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగినట్లు వార్తలు వచ్చాయి.
మంత్రివర్గ సమావేశానికి ముందు ప్రధాని నివాసంలో మన్మోహన్ను కావూరు కలిశారు. మీడియా కథనాల ప్రకారం - ప్రధాని 'రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి?' అని ఆరాతీశారు. దీంతో కావూరు 'రాష్ట్రం నుంచి ఒక్క ఎంపీ గెలిచే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఖాతా తెరవదు' అని స్పష్టం చేశారు. తెలంగాణలో పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన ప్రధానితో, అక్కడా 3-4 స్థానాలకు మించి గెలుస్తుందన్న నమ్మకం లేదని కావూరు వివరించారు. దానిపై ప్రధాని స్పందిస్తూ..'అంటే 33 నుంచి 3 స్థానాలకు పడిపోతున్నామన్న మాట' అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, తన రాజీనామా లేఖలో ప్రధానిని కావూరు తీవ్రంగా విమర్శించారు. 'రాష్ట్ర విభజన తీరు సరిగా లేదంటూ వ్యక్తిగతంగా నేను మిమ్మల్ని చాలాసార్లు కలిశాను. మంత్రి వర్గ నాయకుడు తన సొంత మంత్రి మాటల్నే పట్టించుకోకపోతే ఎలా?' అని కావూరు లేఖలో ప్రశ్నించారు. వాస్తవానికి రెండు రోజుల క్రితమే రాజీనామాకు సిద్ధపడ్డ కావూరు, రాజీనామా లేఖ ఇచ్చేందుకు ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. అయితే, ప్రధాని కార్యాలయం సమయం ఇవ్వకుండా దాటేస్తూ వచ్చింది.
దీంతో గురువారం కేబినెట్ సమావేశం ఉండటంతో దానికి హాజరై అక్కడే రాజీనామా లేఖను ఇవ్వాలని కావూరు నిర్ణయించుకున్నారు. దీంతో కేబినెట్ భేటీకి అర గంట ముందు ఆయనకు ప్రధాని అపాయింట్మెంట్ లభించింది.