పింఛను పథకం వచ్చేస్తోంది.. 15 నుంచే అప్లికేషన్లు..!
ఢిల్లీ : పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. అసంఘటిత రంగ కార్మికులకు పింఛను పథకం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు 10 కోట్ల మందికి లబ్ధి చేకూరబోతుందని చెప్పిన కేంద్రం.. ఆ మేరకు 500 కోట్ల రూపాయలను కేటాయించింది. 60 ఏళ్లు నిండిన కార్మికులకు ప్రతినెలా 3 వేల రూపాయలు ఇవ్వాలనేది ఆ స్కీమ్ ఉద్దేశం. దానికి సంబంధించి విధివిధానాలను శనివారం ప్రకటించింది కేంద్రం.. ఈ నెల 15వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
18-40 ఎంట్రీ ఏజ్.. విధివిధానాలు ఖరారు
60 ఏళ్లు నిండిన అసంఘటిత రంగం కార్మికులకు నెలనెలా 3వేల రూపాయల పింఛను ఇవ్వాలనే ఉద్దేశంతో.. ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ధన్ (PMSYM) పథకం తెరపైకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ మేరకు విధివిధానాలు రూపొందించి శనివారం (09.02.2019) నాడు విడుదల చేశారు అధికారులు. దీని కింద లబ్ధి పొందాలనుకునేవారు ఈ నెల 15 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇందులో చేరాలంటే కనీస వయసు 18 సంవత్సరాలు, గరిష్ఠ వయసు 40 ఏళ్లుగా నిబంధనలు విధించారు. పింఛను రావాలంటే లబ్ధిదారులు ప్రతినెలా కొంత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో అటు కేంద్రం కూడా అంతే మొత్తం జమ చేస్తుంటుంది. అయితే వయసును బట్టి ప్రీమియం మారుతుంటుంది. 18 ఏళ్ల వయసులోనే చేరే కార్మికులు నెలకు 55 రూపాయల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 29 ఏళ్ల ఏజ్ ఉన్నవారు 100 రూపాయలు, 40 ఏళ్లకు దగ్గరలో ఉన్నవారు నెలకు 200 రూపాయలు చెల్లించాలి. అలా ఈ పథకంలో చేరిన కార్మికులకు 60 ఏళ్ల వయసొచ్చాక ప్రతినెలా 3వేల రూపాయలు పింఛను చెల్లిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
అర్హులు వీరే..!
భవన నిర్మాణాల్లో పనిచేసే లేబర్స్, చర్మకారులు, చెత్త ఏరుకునేవారు, స్ట్రీట్ వెండర్స్, మిడ్ డే మీల్ కార్మికులు, ఇళ్లల్లో పనిచేసేవారు, హమాలీలు, రజకులు, వ్యవసాయ కూలీలు, రిక్షా కార్మికులు, భూమిలేని పేదలు.. ఇలా వీరంతా కూడా అసంఘటిత రంగం కింద వచ్చే కార్మికులు. వీరు ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ధన్ పథకం కింద నెలనెలా 3వేల రూపాయలు వచ్చే పింఛను పొందడానికి అర్హులు. ఇక జాతీయ పింఛను పథకం లబ్ధిదారులు, ఈఎస్ఐ బెనిఫిట్ తీసుకునేవారు, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ స్కీమ్ పొందడానికి అర్హులు కాదు. అలాగే నెలకు 15వేల రూపాయల ఆదాయం పొందుతున్నవారు కూడా ఈ స్కీమ్ కు అనర్హులు.
ఇదీ లెక్క..!
ఉదహరణకు ఒక ముప్పై ఏళ్ల వ్యక్తి ఈ స్కీమ్లో చేరితే గనక.. ఆయన దాదాపు 36,000 రూపాయలు కడతారు. 30 ఏళ్ల వయసుకు 100 రూపాయల ప్రీమియం చొప్పున 60 ఏళ్ల వరకు కట్టాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఆయన 30 సంవత్సరాలు వంద రూపాయల ప్రీమియంతో (100X12X30=36,000) 36 వేలు చెల్లిస్తారన్నమాట. ఇక 60 ఏళ్ల తర్వాత ప్రతినెలా ఆయనకు 3వేల రూపాయల చొప్పున పింఛను అందిస్తుంది కేంద్రం. అంటే ఆయన కట్టిన సొమ్ము ఒక ఏడాదిలోనే తిరిగి వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాతి ఏడాది నుంచి లభించే పింఛను తాలూకు పద్దు కేంద్రం ఖాతాలో పడుతుంది. ఈ స్కీమ్ లో కొనసాగేవారు మధ్యలో మరణిస్తే.. ఆయన జీవిత భాగస్వామి దాన్ని కొనసాగించవచ్చు. వద్దనుకుంటే మాత్రం అప్పటిదాకా చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లిస్తారు.