టైంకి రండి.. కలిసికట్టుగా పనిచేయండి.. మంత్రులకు మోడీ సూచన
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలల్లో ఘన విజయం సాధించి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన నరేంద్రమోడీ... బుధవారం తొలిసారి కేబినెట్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంత్రులకు కీలకమైన సూచనలు, సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. విధి నిర్వాహణలో మంత్రులంతా క్రమశిక్షణ పాటించాలని చెప్పినట్లు సమాచారం.
కేంద్ర కేబినెట్ ఆమోదం: జమ్ము కశ్మీర్లో మరో ఆరునెలల పాటు రాష్ట్రపతి పాలన
క్రమశిక్షణ పాటించండి
పనితీరు ద్వారా మినిస్టర్లు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ప్రధాని మోడీ సూచించారు. ఫైళ్లు అనుమతుల్లో వేగంగా పెంచాలని, కేబినెట్, సహాయ మంత్రులు కలిసి కట్టుగా ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోవాలని అన్నారు. మంత్రులందరూ క్రమశిక్షణ పాటించాలన్న మోడీ.. ఆఫీసుకు టైంకు చేరుకుని, ఆ రోజు తమ శాఖకు సంబంధించిన అంశాలపై సంబంధిత అధికారులతో కాసేపు చర్చించాలని చెప్పారు. మినిస్టర్లు క్రమం తప్పకుండా ఆఫీసుకు రావాలని, వర్క్ ఫ్రం హోం పద్దతికి స్వస్తి పలకాలని చెప్పారు.
కలిసి పనిచేయండి
తొలిసారి మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారికి సీనియర్లు వెన్నుదన్నుగా నిలవాలని ప్రధాని మోడీ సూచించారు. సహాయ మంత్రులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, కీలక ఫైళ్ల విషయంలో కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులను కలుపుకుని పోవాలని చెప్పారు. దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుందని మోడీ అభిప్రాయపడ్డారు.
ప్రజలతో మమేకంకండి
మినిస్టర్లు ఒకవైపు తమ తమ శాఖల బాధ్యతలు చూసుకుంటూనే ఎంపీలు, ప్రజలతో టచ్లో ఉండాలని మోడీ చెప్పారు. వివిధ రాష్ట్రాల ఎంపీలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించడం వల్ల మెరుగైన సలహాలు లభిస్తాయని, వాటి వల్ల మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. మంత్రులు, ఎంపీలకు మధ్య పెద్ద తేడా ఏమీ లేదన్న విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
ఐదేళ్ల ఎజెండా
ప్రజలు నమ్మకంతో మరోసారి అధికారం కట్టబెట్టినందున దాన్ని నిలబెట్టుకోవాలన్నారు మోడీ. ప్రతి మంత్రి తమ శాఖకు సంబంధించి ఐదేళ్ల అజెండాను సిద్ధం చేయాలని ఆదేశించారు. వంద రోజుల కార్యాచరణకు సంబంధించి ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. కేబినెట్ భేటీలో పార్లమెంటు సమావేశాలపై నరేంద్ర సింగ్ తోమర్, బడ్జెట్కు సంబంధించి నిర్మలా సీతారామన్, రైల్వే శాఖ గురించి పీయుష్ గోయెల్ ప్రజెంటేషన్లు ఇచ్చారు.