'సారీ'కి స్మృతి ఇరానీ నో, స్పీచ్ వినాలని మోడీ ట్వీట్
న్యూఢిల్లీ: రాజ్యసభలో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యు) వివాదం శుక్రవారం కూడా చల్లారలేదు. జెఎన్యుపై చర్చ సందర్భంగా గురువారం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఈ రోజు ఆందోళనకు దిగాయి.
స్మృతి ఇరానీ సభకు వచ్చి క్షమాపణ చెప్పాలని, అప్పటి వరకూ సభ జరగనీయమని బిఎస్పీ అధినేత్రి, రాజ్యసభ సభ్యురాలు మాయావతి డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ మాయావతికి మద్దతు పలికాయి. స్మృతి ఇరానీ.. దుర్గాదేవిని అవమానించారని విపక్షాలు ఆరోపించాయి.
స్మృతి ఇరానీ వ్యాఖ్యలను ప్రొసీడింగ్స్ నుంచి తొలగించాలని లోకసభలో కాంగ్రెస్ పక్షనేత గులాం నబీ అజాద్ విజ్ఞప్తి చేశారు. ఆమె క్షమాపణ చెప్పాలని, రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలు తొలగించాలన్నారు. దీంతో, నిబంధనలు పరిశీలించి అనంతరం రికార్డుల నుంచి తొలగిస్తామని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ చెప్పారు.
అయితే, విపక్షాల ఆరోపణలను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఘాటుగానే తిప్పికొట్టారు. తాను ఎవరి మనోభావాలను కించపరిచేలా మాట్లాడలేదన్నారు. నేను హిందువునని, దుర్గాదేవి భక్తురాలినని చెప్పారు. దీంతో ఇవాళ కూడా రాజ్యసభలో జెఎన్యు వివాదం కొనసాగుతోంది. తాను దుర్గాపూజ చేస్తానని చెప్పారు.
జెఎన్యు అధికారి డాక్యుమెంట్ ఆధారంగానే తాను అక్కడి విద్యార్థులు నిర్వహించిన మహిషాసుర సంబరాలను సభలో వెల్లడించానని చెప్పారు. ఆ డాక్యుమెంటును చదువుతున్నప్పుడు తాను ఎంతో బాధకు గురయ్యానని చెప్పారు. తాను క్షమాపణ చెప్పేది లేదన్నారు.
స్మృతికి ప్రధాని మోడీ ట్వీట్
లోకసభలో బుధవారం నాడు 45 నిమిషాలకు పైగా సుదీర్ఘ ప్రసంగం చేసి, విపక్షాలకు చుక్కలు చూపించిన కేంద్రమంత్రి స్మ్రతి ఇరానీ ప్రసంగానికి ప్రధాని నరేంద్ర మోడీ ముగ్ధులయ్యారు. హెచ్సియు విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య, జెఎన్యు విద్యార్థులపై దేశద్రోహం కేసుల విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పుబడుతున్న విషయం తెలిసిందే.
सत्यमेव जयते!
— Narendra Modi (@narendramodi) February 24, 2016
Do hear this speech by @smritiirani. https://t.co/1qPbKWbzUI
దీనిపై బుధవారం లోకసభలో జరిగిన చర్చ సందర్భంగా మంత్రి స్మ్రతి ఇరానీ ప్రతి ఒక్కరి ఆరోపణలకు సమాధానమిస్తూ... ప్రతిపక్షాలకు రాజకీయ స్వప్రయోజనాలే తప్ప దేశహితం పట్టదంటూ ఆమె ఏకి పారేశారు. ఈ ప్రసంగంపహై మోడీకి సంతృప్తినిచ్చింది. దీంతో, స్మృతి ప్రసంగంపై ఆయన ట్వీట్ చేశారు. ఆమె ప్రసంగంతో కూడిన యూట్యూబ్ లింక్ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ 'స్మృతి ఇరానీ ప్రసంగాన్ని వినండి, సత్యమేవ జయతే' అని ట్వీట్ చేశారు.