పీఎంసీ బ్యాంకు ఖాతాదారులకు ఊరట.. 10 వేలు విత్డ్రాకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..!
ముంబై : పంజాబ్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్ (పీఎంసీ) ఖాతాదారులకు గొప్ప ఊరట లభించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెయ్యి రూపాయల నగదు విత్ డ్రా పరిమితిని పదివేల రూపాయలకు పెంచుతూ గురువారం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు 60 శాతానికి పైగా డిపాజిటర్లు తమ ఖాతాలోని నగదును తీసుకునే ఛాన్సుందని ప్రకటించింది.
ఖాతాదారులు పదివేల రూపాయల వరకు నగదు విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. ఇదివరకు వెయ్యి రూపాయలు మాత్రమే తీసుకునే ఛాన్స్ ఉండటంతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. ఆర్బీఐ తాజా నిర్ణయంతో వారు కాసింత ఊరట చెందుతున్నారు. సేవింగ్స్, కరెంట్ అకౌంట్స్ తో పాటు డిపాజిట్లు తదితర ఏ అకౌంటైనా సరే సెప్టెంబర్ 23 నుంచి పది వేల రూపాయల వరకు నగదు విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది.
24వ తేదీ మంగళవారం నాడు పీఎంసీ బ్యాంకుకు సంబంధించి ఆర్బీఐ విధించిన నిబంధనలు షాక్కు గురి చేశాయి. ఖాతాదారులు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే విత్ డ్రా చేయాలనే నిబంధన కాసింత ఆందోళనకు గురిచేసింది. దాని తర్వాత పరిణామాలు గమనించిన ఆర్బీఐ గురువారం నాడు ఆ వెయ్యి రూపాయల నగదు విత్ డ్రా పరిమితిని పది వేలకు పెంచింది.
బుధవారం నాడు బీజేపీ ఎంపీ కిరిట్ సోమయ్యతో పాటు కొంతమంది ఖాతాదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎకానమిక్ ఆఫెన్సెస్ వింగ్ పోలీసులకు లిఖిత పూర్వక కంప్లైంట్ చేశారు. తొమ్మిది లక్షలకు పైగా ఖతాదారులను బ్యాంక్ మేనేజ్మెంట్తో పాటు రియల్ ఎస్టేట్ సంస్థ హెచ్డీఐఎల్ మోసం చేసిందని ఆరోపించారు. బ్యాంకు ఉన్నతాధికారులపై ఖాతాదారులు సియాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.