భారీ మొత్తంగా లోన్లు.. ఎగవేతదారుడి ఇంటి ఎదుట బ్యాంకు ఉద్యోగుల ధర్నా
ముంబై : భారీ మొత్తంగా లోన్లు తీసుకున్నారు. తీరా చెల్లించే విషయంలో మాత్రం జాన్తా నై అంటున్నారు. పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థగా ఫోజులు కొట్టి రుణాలైతే తీసుకున్నారు గానీ తిరిగి చెల్లించేటప్పుడు మాత్రం బ్యాంకు అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. కోట్ల రూపాయల్లో లోన్లు తీసుకోవడంతో అటు డిపాజిటర్లు, ఖాతాదారులు కూడా ఇబ్బందులు పడక తప్పడం లేదు.
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ) ఉద్యోగులు రోడ్డెక్కారు. అయితే వాళ్లు ఆందోళనకు దిగింది సమస్యల పరిష్కారం కోసమో, జీతాలు పెంచమనో కాదు. తమ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు చెల్లించాలని కోరుతూ రుణ ఎగవేత దారుడి ఇంటి ఎదుట బైఠాయించారు. హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (హెచ్డీఐఎల్) రియల్ ఎస్టేట్ గ్రూప్ యజమాని.. సదరు బ్యాంకు నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకుని తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారు.
పీఎంసీ బ్యాంకు ఖాతాదారులకు ఊరట.. 10 వేలు విత్డ్రాకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్..!
ఆ క్రమంలో పీఎంసీ బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోయింది. అటు డిపాజిటర్లు, ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీఐ కూడా వెయ్యి రూపాయలకు నగదు విత్ డ్రా పరిమితం చేయడం ఖాతాదారులను ఆందోళనకు గురి చేసింది. దాంతో తాజా పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ మరోసారి పునఃపరిశీలించి ఆ పరిమితిని కాస్తా పది వేల రూపాయలకు పెంచింది. అదే సమయంలో కొందరు ఖాతాదారులు సియాన్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ చేశారు.
అయితే భారీగా లోన్లు తీసుకున్న హెచ్డీఐఎల్ సంస్థ యజమాని వాటిని తిరిగి చెల్లించడంలో బ్యాంకు అధికారులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. దాంతో చివరకు చేసేదేమీ లేక ఆయన ఇంటి ఎదుట బ్యాంకు ఉద్యోగులు నిరసనకు దిగారు. వారికి తోడుగా కొందరు ఖాతాదారులు సైతం వెన్నంటి ఉన్నట్లు తెలుస్తోంది. పీఎంసీ బ్యాంకు రుణ ఎగవేతదారుల్లో హెచ్డీఐఎల్ సంస్థ టాప్ ప్లేస్లో ఉండటం గమనార్హం. లోన్లు తీసుకున్నవారు సక్రమంగా చెల్లిస్తే గానీ బ్యాంకు నిలదొక్కుకోవడం కష్టతరంగా మారింది.