PMC Bank:కస్టమర్లకు భారీ ఊరట కల్పించిన ఆర్బీఐ, ఇక రూ. 50వేలు విత్డ్రా
న్యూఢిల్లీ: పంజాబ్, మహారాష్ట్ర కో-ఆపరేటివ్(పీఎంసీ) బ్యాంక్ వినియోగదారులకు భారత రిజర్వు బ్యాంక్ భారీ ఊరట కల్పించింది. పీఎంసీ బ్యాంకు ఖాతాదారులు తమ ఖాతాల నుంచి ఉపసంహరించుకునే మొత్తాన్ని రూ. 40,000 నుంచి రూ. 50,000లకు పెంచింది.
నో బెయిల్.. ఓన్లీ జైల్: పీఎంసీ బ్యాంక్ స్కాంపై కస్టమర్ల భారీ నిరసన, కోర్టు ముందు వాహనాల ధ్వంసం
బ్యాంకులో ఉన్న తమ సొమ్మును తాము తీసుకునేందుకు ఆంక్షలు విధించడంపై గత కొద్ది రోజులుగా పీఎంసీ ఖాతాదారులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, పీఎంసీ బ్యాంకులో ద్రవ్య స్థితిని బట్టి తాము రూ. 50వేలు ఉపసంహరించుకునేందుకు వినియోగదారులకు అవకాశమిచ్చామని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.
ఇంతకుముందు రూ. 40వేలు ఉపసంహరించుకునేందుకు అనుమతిచ్చినట్లు తెలిపింది. ప్రస్తుతం ఉపసంహరణ మొత్తాన్ని పెంచిన నేపథ్యంలో దాదాపు 78శాతం మంది వినియోగదారులు బ్యాంకులోని తమ మొత్తం నిల్వను ఉపసంహరించుకునే వీలు కలిగిందని వెల్లడించింది.
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్(పీఎంసీ) బ్యాంకులో ఏర్పడిన సంక్షోభం నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని బాంబే హైకోర్టు సోమవారం భారత రిజర్వు బ్యాంకును ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రిజర్వు బ్యాంకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, సెప్టెంబర్ 23న పీఎంసీ బ్యాంకులో చోటు చేసుకున్న కుంభకోణం కారణంగా ఆ బ్యాంకు వినియోగదారులు ఎవరూ కూడా నెలకు రూ. 1000కి మించి ఉపసంహరించుకోకూడదని ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఆ తర్వాత వినియోగదారుల ఆందోళనలతో ఆ మొత్తాన్ని రూ. 10వేలు ఆ తర్వాత రూ. 40వేలకు పెంచింది.
ఇది ఇలావుంటే, పీఎంసీ కుంభకోణంలో కీలకమైన హౌసింగ్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్డీఐఎల్) ఉన్నతాధికారులకు సంబంధించిన ఆస్తులపై దృష్టి సారించింది ఈడీ. ఇప్పటికే హౌసింగ్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్డీఐఎల్) కంపెనీకి చెందిన ఓ ప్రైవేట్ జెట్, పలు కార్లను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇవన్నీ సదరు కంపెనీ ప్రమోటర్లైన రాకేష్, సారంగ్ వాధ్వాన్లకు చెందినవి.
ఆలీభాగ్లోని 22 గదులు కలిగిన ఇల్లు, మరో విమానం, మాల్దీవుల్లో ఉన్న క్రీడలకు ఉపయోగించే ఓ బోటును ఈడీ గుర్తించింది. ఈ ఆస్తులను కూడా త్వరలోనే ఈడీ అటాచ్ చేయనుంది. మహారాష్ట్రలోని ఖరీదైన ప్రాంతాల్లో అనేక ఇళ్లను రాజకీయ నాయకులకు ఈ కంపెనీ కానుకలుగా అందజేసినట్లు ఈడీ గుర్తించింది. అయితే, రాజకీయ నాయకుల పేర్లను మాత్రం ఈడీ వెల్లడించలేదు. ఇక ముంబై పోలీసు శాఖలో భాగమైన ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే పీఎంసీ స్కాంలో రూ. 4వేల కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. వీటిలో చరాస్తులు, సేవింగ్ అకౌంట్స్, విలువైన ఆభరణాలు ఉన్నాయి. కాగా, ఇప్పటికే హెచ్డీఐఎల్ డైరెక్టర్లు, ప్రమోటర్లు అయిన రాకేష్ వాద్వాన్, సారంగ్ వాద్వాన్లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత దశాబ్ద కాలంలో బ్యాంకుకు రూ. 4,355.43కోట్ల మేర జరిగిన నష్టంలో పీఎంసీ బ్యాంక్, హెచ్డీఐఎల్ సీనియర్ అధికారులపై ఆర్థిక ఉల్లంఘనల పోలీసు విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్లో పీఎంసీ బ్యాంక్ ఎండీ జాయ్ థామన్, మాజీ ఛైర్మన్ వార్యమ్ సింగ్, ఇతర ఉన్నతాధికారుల పేర్లు కూడా ఉన్నాయి.