పీఎంసీ స్కాం: 22 గదుల ఇళ్లు, మరో విమానం గుర్తించిన ఈడీ
ముంబై: పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్(పీఎంసీ) బ్యాంక్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడును ప్రదర్శిస్తోంది. పీఎంసీ కుంభకోణంలో కీలకమైన హౌసింగ్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్డీఐఎల్) ఉన్నతాధికారులకు సంబంధించిన ఆస్తులపై దృష్టి సారించింది.
గత వారం హౌసింగ్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్(హెచ్డీఐఎల్) కంపెనీకి చెందిన ఓ ప్రైవేట్ జెట్, పలు కార్లను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఇవన్నీ సదరు కంపెనీ ప్రమోటర్లైన రాకేష్, సారంగ్ వాధ్వాన్లకు చెందినవి.
ఇక సోమవారం కూడా సోదాలు కొనసాగించింది ఈడీ. ఆలీభాగ్లోని 22 గదులు కలిగిన ఇల్లు, మరో విమానం, మాల్దీవుల్లో ఉన్న క్రీడలకు ఉపయోగించే ఓ బోటును ఈడీ గుర్తించింది. ఈ ఆస్తులను కూడా త్వరలోనే ఈడీ అటాచ్ చేయనుంది.
మహారాష్ట్రలోని ఖరీదైన ప్రాంతాల్లో అనేక ఇళ్లను రాజకీయ నాయకులకు ఈ కంపెనీ కానుకలుగా అందజేసినట్లు ఈడీ గుర్తించింది. అయితే, రాజకీయ నాయకుల పేర్లను మాత్రం ఈడీ వెల్లడించలేదు.
ఇక ముంబై పోలీసు శాఖలో భాగమైన ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే పీఎంసీ స్కాంలో రూ. 4వేల కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. వీటిలో చరాస్తులు, సేవింగ్ అకౌంట్స్, విలువైన ఆభరణాలు ఉన్నాయి.
కాగా, ఇప్పటికే హెచ్డీఐఎల్ డైరెక్టర్లు, ప్రమోటర్లు అయిన రాకేష్ వాద్వాన్, సారంగ్ వాద్వాన్లను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గత దశాబ్ద కాలంలో బ్యాంకుకు రూ. 4,355.43కోట్ల మేర జరిగిన నష్టంలో పీఎంసీ బ్యాంక్, హెచ్డీఐఎల్ సీనియర్ అధికారులపై ఆర్థిక ఉల్లంఘనల పోలీసు విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్లో పీఎంసీ బ్యాంక్ ఎండీ జాయ్ థామన్, మాజీ ఛైర్మన్ వార్యమ్ సింగ్, ఇతర ఉన్నతాధికారుల పేర్లు కూడా ఉన్నాయి.