పీఎంసీ బ్యాంకు స్కామ్ నిందితుల బెయిల్పై స్టే ఇచ్చిన సుప్రీం కోర్టు
కొన్ని నెలల క్రితం వెలుగులోకి వచ్చిన పంజాబ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ) స్కామ్లో ప్రధాన నిందితులుగా ఉన్న రాకేష్ మరియు సారంగ్ వధావన్ల విడుదలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. బాంబే హైకోర్టు వారిని విడుదల చేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు నిందితుల విడుదలపై స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి అత్యవసర విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంను కోరింది.
బెయిల్ పై స్టే ఇవ్వాలని కోరిన కేంద్రం
పీఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరి వ్యక్తులను విడుదల చేయాలంటూ అసహజ రీతిలో బుధవారం రోజున బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని కేంద్రం తరపున వాదనలు వినిపించిన సాల్సిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ఇద్దరు వ్యక్తులు రాకేష్ మరియు సారంగ్ వధవన్లు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. పిల్ను ఆధారం చేసుకుని వారికి బెయిల్ మంజూరు చేయడం అనేది సరికాదని బాంబే హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలంటే తుషార్ మెహతా అత్యున్నత న్యాయస్థానంను కోరారు.
వారి ఆస్తులను వేలం వేయాలన్న బాంబే హైకోర్టు
తండ్రీ కొడుకులు ఇద్దరు హౌజింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో ప్రమోటర్లుగా ఉన్నారని ఇక్కడి నుంచే బ్యాంకులో స్కామ్కు బీజం పడిందని తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇక వధవన్లకు సంబంధించిన కంపెనీల ఆస్తులను వేలం వేయాలని బాంబే హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది . ఇందుకోసం త్రిసభ్య కమిటీని బాంబే హైకోర్టు నియమించింది. నిందితుల ఆస్తులు వేలం వేసిన తర్వాత వచ్చిన డబ్బును పీఎంసీ బ్యాంకు కస్టమర్లకు చెల్లించాలంటూ బాంబే హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాదు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కూడా కమిటీకి సహకరించాలని ఆదేశాలిచ్చింది.
పిల్ను విచారణ చేసిన బాంబే హైకోర్టు
ఇక పీఎంసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విడుదల చేస్తూ ఆదేశాలిచ్చిన బాంబే హైకోర్టు... నిందితుల ఇంటి వద్ద పోలీసులను రక్షణగా పెట్టాలని సూచించింది. అంతేకాదు మహారాష్ట్ర దాటి వారు వెళ్లరాదని ఆదేశాల్లో బాంబే హైకోర్టు పేర్కొంది. సరోష్ దమానియా అనే అడ్వకేట్ వేసిన ప్రజాప్రయోజనవ్యాజ్యం పిల్ను బాంబే హైకోర్టు బుధవారం విచారణ చేసి పై ఆదేశాలు ఇచ్చింది.
పీఎంసీ బ్యాంక్ స్కామ్లో 12 మంది అరెస్టు
గతేడాది డిసెంబర్ 27న ముంబై పోలీస్ శాఖకు చెందిన ఆర్థికనేర విభాగం పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో తొలి చార్జ్షీట్ను దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 12 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బ్యాంకు స్కామ్లో ప్రధాన నిందితులుగా ఉన్న రాకేష్ , సారంగ్ వధావన్ వర్యాం సింగ్, జాయ్ థామస్, సుర్జీత్ అరోరాలపై 32వేల పేజీలతో కూడిన చార్జ్షీట్ దాఖలు చేసింది ఆర్థిక నేర విభాగం.