టపాసు పేల్చిఆనందం: జయకి అస్వస్థత, శశికళ చికిత్స
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి, మంత్రి, కార్యకర్తలు రోదిస్తుండగా.. ప్రత్యర్థులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత జైలుకు వెళ్లిన సందర్భంగా పీఎంకే కార్యకర్తలు కొందరు సంతోషంగా టపాకాయలు కాల్చారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.
జయలలితను కలవనున్న పన్నీరు సెల్వం
తమిళనాడు ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన తన్నీరు సెల్వం కర్నాటక రాజధాని బెంగళూరు జైలులో ఉన్న అధినేత్రి జయలలితను కలవనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినందున అతను వచ్చి అమ్మ ఆశీస్సులు తీసుకోనున్నారని తెలుస్తోంది.
జయలలితకు స్వల్ప అస్వస్థత
బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత స్వల్ప అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. ఆమెను వెంటనే జైలులోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. జయలలితకు కళ్లు మసకగా కనిపిస్తున్నాయని, అలాగే షుగర్ లెవల్ పడిపోయాయని తెలుస్తోంది.
తనకు చికిత్స కోసం తన సన్నిహితురాలు శశికళకు తన ఆరోగ్య విషయాలు తెలుసునని ఆమె చెప్పారని తెలుస్తోంది. దీంతో శశికళ ఆమెకు చేసేందుకు వెళ్లారని తెలుస్తోంది.