ఆ ముగ్గురికే ఫోన్ .. మరో 37 మంది ఎవరో ?
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. గురువారం సాయంత్రం మరోసారి మోదీ అను నేను అని ప్రమాణం చేయబోతున్నారు. అయితే అతని క్యాబినెట్లో చోటు దక్కేదెవరికి అనే చర్చ జరుగుతోంది. మొత్తం 40 మందిలో ఇప్పటికే ముగ్గురికి సమాచారం ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
జైట్లీ దూరం ..
బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అనారోగ్య సమస్యల వల్ల తాను మరోసారి కేంద్రమంత్రి పదవీ చేపట్టబోనని స్పష్టంచేశారు. సుష్మాస్వరాజ్ కూడా మంత్రి పదవీ చేపట్టేందుకు అయిష్టత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జైట్లీ స్థానంలో అమిత్ షా క్యాబినెట్లోకి రానున్నారు. ఇటు పార్టీ చీఫ్గా జేడీ నడ్డాను నియమించబోతున్నారు. వివిధ సామాజిక సమీకరణాలు, రాష్ట్రాలవారీగా బెర్త్ దక్కనుంది.
ముగ్గురికే ఫోన్ ..
అయితే ఇప్పటివరకు ముగ్గురికి అధికారికంగా మంత్రి పదవీ నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రదాన్, ప్రకాశ్ జవదేకర్ కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. వీరి శాఖలపై మాత్రం స్పష్టత రాలేదు. షా, రాజ్ నాథ్ బెర్త్ ఖరారైన నేపథ్యంలో మరో 35 మంది ఎవరనే చర్చ జరుగుతుంది. అయితే మంత్రివర్గం, ఎవరికీ ఏ శాఖ కేటాయించాలనే అంశంపై మోదీతో అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ విడతలుగా చర్చించారు. ఈ భేటీలో శాఖలపై కూడా క్లారిటీ వచ్చినట్టు సమాచారం. మోదీతోపాటు ముఖ్య నేతలు గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఎవరికీ దక్కెనో ..?
ఇదివరకు తెలంగాణ రాష్ట్రం నుంచి బండారు దత్రాత్రేయ ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఎవరికీ బెర్త్ దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఇటీవల రాష్ట్రంలో బీజేపీ 4 చోట్ల గెలవడం .. ముగ్గురు నేతల బలమైన వారు ఉండటంతో మంత్రి పదవీ ఎవరికీ ఇస్తారనే చర్చ జరుగుతుంది. రేసులో ప్రధానంగా కిషన్ రెడ్డి, ధర్మపురి అర్వంద్ ఉన్నారు. వీరితోపాటు ఇటీవల కరీంనగర్ గడ్డపై జెండా ఎగరేసిన సంజయ్ కుమార్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే బీజేపీ హైకమాండ్ ఎవరివైపు మొగ్గుచూపుతుందో తెలియాలంటే .. మరికొన్ని గంటలు ఆగాల్సిందే.