చైనా ఉత్పత్తులకు చెక్- భారీ స్కెచ్ రెడీ చేస్తున్న కేంద్రం- వివరాలు కోరిన పీఎంవో...
మన దేశంలోకి చౌక ధరల పేరుతో నాసిరకం వస్తువులను అమ్ముకుంటూ మన సైనికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పొరుగుదేశం చైనా తోకను పూర్తిగా కత్తిరించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. దేశంలో చైనా నుంచి తామరతంపరగా వచ్చిపడుతున్న చైనా ఉత్పత్తులను, వాటి నాణ్యతను పరిశీలించాలని, వాటికి లభిస్తున్న పన్ను మినహాయింపు ప్రయోజనాలను సమీక్షించాలని కేంద్రం నిర్ణయించింది. వీటి ఆధారంగా చైనా ఉత్పత్తులకు త్వరలోనే చెక్ పెట్టబోతోంది.
Recommended Video
చైనా వస్తువుల గుర్తింపు...
చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న వేలాది వస్తువుల్లో చాలా మటుకు నాసిరకానివే. చౌకగా లభిస్తున్నాయనే పేరుతో ఇన్నాళ్లు వీటిని చూసీ చూడనట్లుగా వదిలేసిన కేంద్రం... గల్వాన్ లోయలో భారత సైనికులను డ్రాగన్ బలగాలు పొట్టనబెట్టుకున్నాక వీటిపై కఠినంగా వ్యవహించాలని నిర్ణయించింది. చైనా ఉత్పత్తుల బహిష్కరణ విషయంలో మరో మాటకు తావులేదని ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు ప్రకటించగా.. తాజాగా ప్రధాని మోడీ ఓ అత్యున్నత స్ధాయి సమావేశం ఏర్పాటు చేసి చైనా ఉత్పత్తులను గుర్తించాలని ఆదేశాలు ఇచ్చారు.
ముందుగా నాసిరకం గుర్తింపు...
చైనా నుంచి దేశంలో దిగుమతి అవుతున్న వస్తువుల్లో నాసిరకం వస్తువులను, అవి దేశంలో పొందుతున్న పన్ను మినహాయింపులను కేంద్రం ముందుగా సమీక్షించబోతోంది. ఇందులో భాగంగా నాసిరకం వస్తువుల జాబితా సిద్దం చేయాలని ప్రధాని మోడీ ఆదేశాలు ఇచ్చారు. ఈ జాబితా సిద్ధం కాగానే ముందుగా వీటిపై నిషేధం విధిస్తారు. అనంతరం మిగిలిన వస్తువులపై దృష్టిసారించనున్నారు. అలాగే అవి పొందుతున్న పన్ను మినహాయింపులను గుర్తించి ఆ జాబితా నుంచి కూడా వీటిని తొలగిస్తారు.
ఆత్మనిర్భర్ భారత్ పేరుతో...
కరోనా వైరస్ నేపథ్యంలో దేశీయంగా పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటించింది. ఇందులో భాగంగానే దేశీయంగా ఉన్న పరిశ్రమలను ముందుగా ప్రోత్సహించనున్నారు. ఆ తర్వాతే విదేశీ సంస్ధలు, ఎంఎన్సీలకు అవకాశాలు కల్పిస్తారు. తాజాగా చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో ముందుగా చైనా పరిశ్రమలపైనే వేటు వేయాలని కేంద్రం భావిస్తోంది. స్వదేశీ పేరుతో వీటికి చెక్ పెట్టేందుకు కేంద్రం వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. అదే జరిగితే భారత్ లో అతిపెద్ద మార్కెట్ కలిగిన చైనా ఉత్పత్తులన్నీ ఇక వారి దేశీయ మార్కెట్లో అమ్ముకోవాల్సిందే. చైనా సంస్ధలు కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టపోవాల్సిందే.