'పీఎన్బీ'పై మరో పిడుగు: 10వేల ఖాతాల డేటా లీక్.. సీవివితో సహా!
Recommended Video
న్యూఢిల్లీ: వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ చేసిన రూ.11వేల కోట్ల స్కామ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ను కుదిపేసిన సంగతి తెలిసిందే. కుంభకోణంతో ఇప్పటికే అప్రతిష్ట పాలైన బ్యాంకు యాజమాన్యానికి మరో తలనొప్పి మొదలైంది.
పీఎన్బీ నుంచి దాదాపు 10వేల ఖాతాలకు సంబంధించిన డేటా లీక్ అయిందని హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే ఆసియా టైమ్స్ తాజాగా వెల్లడించింది. డెబిట్ కార్డ్ హోల్డర్లతో పాటు క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ ఖాతాలు కూడా లీకైనట్టు తెలిపింది.
నీరవ్ మోసం-పీఎన్బీ స్కాం: 'నిధులు లేకపోతే మీ ఆస్తులు అమ్మేయండి'
సీవివితో సహా:
లీకైన సమాచారంలో ఖాతాదారుల పేర్లు, గడువు తేదీలు, వ్యక్తిగత వివరాలు ఉన్నట్టు ఆసియా టైమ్స్ పేర్కొంది. లీకైన డేటాలో ఖాతాదారులకు సంబంధించిన డెబిట్ కార్డు సీవివి నంబర్స్ కూడా లీకైనట్టు తెలపడం గమనార్హం. కొంతమంది ఖాతాదారుల వివరాల్లో మాత్రం సీవివి వివరాలు లేవని తెలిపింది.
లీకైన డేటా.. ఇంటర్నెట్లో:
పీఎన్బీ నుంచి లీకైన సమాచారం గత మూడు నెలలుగా ఇంటర్నెట్లో అందుబాటులో ఉందని ఆసియా టైమ్స్ పేర్కొంది. సింగపూర్ కు చెందిన క్లౌడ్ సెక్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సంస్థ ఈ విషయాన్ని గుర్తించింది. డేటా ట్రాన్సాక్షన్స్ కు సంబంధించిన వ్యవహారాలపై ఈ సంస్థ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతుంది. గూగుల్ సెర్చ్ లో దొరకని డేటాను కూడా క్లౌడ్ సెక్ సంస్థ గుర్తించగలదు.
క్లౌడ్ సెక్ చీఫ్ శశి స్పందన:
క్లౌడ్ సెక్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ శశి దీనిపై స్పందించారు. ఇలాంటి అక్రమ డేటా ట్రాన్సాక్షన్స్ గుర్తించడానికి తమ వద్ద ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ఉన్నట్టు చెప్పారు. డార్క్ వెబ్ సైట్స్ నుంచి సైతం ఆ సాఫ్ట్ వేర్ ద్వారా డేటాను గుర్తించగలమని, డేటా ఏమాత్రం అనుమానస్పదంగా ఉన్నా క్లయింట్స్ ను అప్రమత్తం చేస్తామని తెలిపారు.
అమ్మకానికి డేటా..:
పీఎన్బీ నుంచి లీకైన డేటాను ఇంటర్నెట్ లో అమ్మకానికి పెట్టారని, ఒక్కో కార్డు వివరాలను కేవలం రూ.320కే విక్రయిస్తున్నారని క్లౌడ్ సెక్ ఏజెన్సీ తెలిపింది. దీనిపై ప్రభుత్వంతో సంప్రదించడానికి ఆ సంస్థ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలుస్తోంది.