పీఎన్బీ స్కాం: 31 బ్యాంకులకు మరో రూ. 5,280కోట్లు చెల్లించని ‘గీతాంజలి’
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాంలో మరో సంచలన విషయం వెలుగు చూసింది. పీఎన్బీ స్కాంలో రూ.11,400కోట్ల మేర రుణాలను ఎగ్గొట్టి ప్రముఖ నగల వ్యాపారులు నీరవ్ మోడీ, మెహుల్ ఛోక్సీలు దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే.
కాగా, ఛోక్సీకి చెందిన గీతాంజలి గ్రూప్ మరో రూ.5,280 కోట్ల రుణాలను ఎగ్గొట్టిందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. గీతాంజలి జువెల్లరీకి 31 బ్యాంకులకు జరిగిన లావాదేవీలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను, ఒప్పందాలను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి.
రూ.5,280కోట్లను వర్కింగ్ కేపిటల్ ఫెసిలిటీగా గీతాంజలి సంస్థకు ఆ 31బ్యాంకులు అందించగా.. ఇప్పటి వరకూ ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేదని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ లోన్ను అక్టోబర్ 2016లో ఇవ్వగా, అక్టోబర్ 2017లో పూర్తి చెల్లింపుతో అగ్రిమెంటు చేసుకున్నాయి బ్యాంకులు.
ఈ రుణాలు అందించిన బ్యాంకుల్లో పీఎన్బీ(రూ.587కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్(రూ.405కోట్లు), కార్పొరేషన్ బ్యాంక్(రూ.297కోట్ల) పెద్ద మొత్తాలను అందించాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే, ఈ మొత్తాలను బ్యాంకులు తిరిగి పొందడం కష్టమైన విషయమేనని తెలుస్తోంది.