పీఎన్బీ స్కాం: నిర్మలపై పరువు నష్టం దావా వేస్తానంటూ సింఘ్వీ హెచ్చరిక
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణం నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు మధ్య పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. యూపీఏ హయాంలోనే ఈ స్కాం జరిగిందని బీజేపీ వాదిస్తుండగా.. వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి బీజేపీ వత్తాసు పలికిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
కాగా, కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్ తాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా పీఎన్బీ స్కాంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోడీకి చెందిన ఓ కంపెనీలో తన కుటుంబీకులకు షేర్లు ఉన్నాయన్నఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
నిరాధార ఆరోపణలు చేసిన రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్పై పరువు నష్టం దావా వేస్తానని, చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. అంతేగాక, నిర్మలా సీతారామన్ చేసిన నిరాధార ఆరోపణలను ప్రచురించే అన్ని మీడియా సంస్థలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
వ్యక్తిగతంగా తనకు గానీ, తనభార్య, కుమారుడికిగానీ గీతాంజలి, నీరవ్ మోడీతో ఎలాంటి సంబంధాలు లేవ స్పష్టం చేశారు. నిరాధారమైన, అవాస్తవమైన ఆరోపణలు పౌర, క్రిమినల్ సహా అన్ని చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని సింఘ్వీ చెప్పారు.
తన భార్య, కుమారుడు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీకి చెందిన స్థలంలో ఐదేళ్ల క్రితం నీరవ్ మోడీకి చెందిన కంపెనీ అద్దెకు తీసుకున్నారనీ, ఈ ఒప్పందం 2017 డిసెంబరుతోనే ముగిసిపోయినట్టు స్పష్టం చేశారు.