పరారైన ఆర్థిక నేరగాళ్ల చట్టం: నీరవ్ మోడీ, ఛోక్సీ, మాల్యాలకు సమన్లు జారీ
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)కు రూ.14వేల కోట్లకు పైగా రుణాలు ఎగ్గొట్టి పెట్టి విదేశాలకు పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, ఆయన మేనమామ మెహుల్ ఛోక్సీకి పీఎమ్ఎల్ఏ కోర్టు పరారైన ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద సమన్లు పంపింది.
సెప్టెంబర్ 25,26 తేదీల్లో హాజరు కావాలని సూచించింది. వారిద్దరినీ పరారైన ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించాలని, రూ. 3,500 కోట్ల ఆస్తులు జప్తు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు వేరు వేరు పిటిషన్లు పీఎమ్ఎల్ఏ కోర్టులో దాఖలు చేయడంతో సమన్లు పంపింది.
పరారైన ఆర్థిక నేరగాళ్ల చట్టాన్ని జులై 19న లోక్సభ, 25న రాజ్యసభ ఆమోదించిన విషయం తెలిసిందే. రూ.9000 కోట్ల మేర బ్యాంకు రుణాలు ఎగవేసి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా వ్యవహారంలోనూ ఈడీ ఇదేవిధంగా పీఎమ్ఎల్ఏ కోర్టును ఆశ్రయించగా ఆగస్టు 27న హాజరు కావాలని ఆయనకు సమన్లు జారీ చేసింది.